ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్కల్యాణే: నాదెండ్ల
తిరుపతి అన్నమయ్యసర్కిల్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థి ముమ్మాటికీ పవన్కల్యాణే అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం ఉదయం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఆయన ప్రమాద బీమా, సభ్యత్వ కిట్లను అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి జరిగిన జనసేన, బీజేపీ సమన్వయ సమావేశంలో పవన్కల్యాణ్ నాయకత్వాన్ని ప్రధాని మోడీ, అమిత్షా ధ్రువీకరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్న మాటలను స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అంతరించిపోయిందని, రానున్న రోజుల్లో జనసేన, బీజేపీ కలసి ప్రజాసమస్యల మీద పోరాటం చేస్తాయని చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చేవారం తిరుపతిలో పవన్కల్యాణ్ రోడ్ షో ఉంటుందని తెలిపారు. పీఏసీ సభ్యుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.