
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress Govt) కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే విజిలెన్స్ దాడులంటూ బ్లాక్మెయిల్ చేస్తారా అని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల, యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోంది అని విమర్శలు చేశారు.
హైదరాబాద్లోని నల్లకుంట పరిధిలోని ఉన్న శంకర్మఠ్కు బుధవారం ఉదయం బండి సంజయ్ వెళ్లారు. శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా?. కమీషన్లు రావనే సాకుతోనే సర్కార్ పెద్దలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదా?. అసెంబ్లీ (Telangana Assembly) సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాలరాస్తారా?. పదేపదే ఇచ్చిన మాటను తప్పే వాళ్లను ఏమనాలి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
బీహార్ ఎన్నికల(Bihar Elections) కోసం తెలంగాణ నుంచే పైసలు పంపుతున్నారు కదా. మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేని దిన స్థితిలో ప్రభుత్వం ఉందా?. తక్షణమే బకాయిలు రూ.10 వేల కోట్లు చెల్లించాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి నిరసనలకు దిగుతాం. ఖబడ్దార్ మంత్రులను రోడ్లపై తిరగనీయబోమని హెచ్చరిస్తున్నాం. ఇదే సమయంలో కళాశాలల యజమాన్యాలు కూడా ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులని అన్నారు. అలా చేస్తే.. భవిష్యత్తులో వారికి ఎవరూ అండగా నిలబడే పరిస్థితి ఉండదన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలపైనా ప్రైవేటు ఆసుపత్రులు రోడ్డెక్కడం తథ్యమని అన్నారు. మంత్రులు ప్రతి పనికి కమీషన్లు వసూలు చేస్తున్నారని.. వచ్చిన సొమ్మును కాంగ్రెస్ హైకమాండ్కు కప్పం కడుతున్నారు అంటూ విమర్శలు చేశారు.
