CM KCR సీఎం వద్దకు చేరిన మేడ్చల్ పంచాయితీ
గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని జడ్పీ చైర్మన్ శరత్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తమపై అవాకులు చెవాకులు పేలుతూ గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, ఆయన కుమారుడు, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. సంస్థాగత కమిటీల్లో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, గ్రూపు రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నందున జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని శరత్ చంద్రారెడ్డి చెప్పారు.
చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం
ఈ నేపథ్యంలో శుక్రవారం శాసనసభ ఆవరణలో మల్లారెడ్డి, సుధీర్రెడ్డి, శరత్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను వేర్వేరుగా కలిశారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ సూచించడంతోపాటు, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జిల్లా టీఆర్ఎస్ నేతలతో సమావేశమవుతానని కేసీఆర్ సర్దిచెప్పినట్లు సమాచారం. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారని, అందువల్ల తాను రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శరత్ చంద్రారెడ్డి వెల్లడించారు. కాగా అసెంబ్లీకి వచ్చిన శరత్ చంద్రారెడ్డికి విజిటర్ పాస్ లేకపోవడంతో పోలీసులు లోనికి అనుమతించలేదు. ఈ విషయం తెలుసుకున్న మల్లారెడ్డి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఆయనను లోనికి తీసుకెళ్లారు.
చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి