జంగిల్‌ రాజ్‌తో డిఫెన్స్‌లో చంద్రబాబు! | KSR's Comments On YS Jagan Mohan Reddy's Punch Dialogues About TDP Administration | Sakshi
Sakshi News home page

జంగిల్‌ రాజ్‌తో డిఫెన్స్‌లో చంద్రబాబు!

Jul 3 2026 10:13 AM | Updated on Jul 3 2026 11:03 AM

KSR's Comments On YS Jagan Mohan Reddy's Punch Dialogues About TDP Administration

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఈసారి కూడా సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టారు. జగన్‌కు బౌలింగ్ ఎలా వేయాలో అర్థం కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిలగిలలాడినట్లు అనిపిస్తుంది. జగన్ చేసిన విమర్శలకు నేరుగా జవాబు ఇవ్వలేక చంద్రబాబు అసందర్భ వ్యాఖ్యలకే పరిమితం అయ్యారా! అన్న భావన కలుగుతుంది. ఒకసారి జగన్ కొట్టిన రాజకీయ సిక్సర్లు ఏమిటో చూద్దాం..

హే రామ్.. సేవ్‌ ఆంధ్ర! రాష్ట్రంలో జంగిల్  పాలన, 18 నెలల సీసీ టీవీ పుటేజి తీసివేశారంటే ఎందరిని పోలీసులు చంపారో! జీవించి ఉంటే ఎన్టీఆర్‌పై కూడా రౌడీ షీట్ పెట్టేవారేమో!, రాజకీయ స్వార్ధంతో పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్తులో వారికి పథకాలు ఎలా వస్తాయి? మీ పార్టీ నాయకులు దళితులను కించపరుస్తుంటే మీరేం చేస్తున్నారు? దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్‌లపై చంద్రబాబు వైఖరి ఏమిటి? అమరావతిలో అవినీతికి వ్యతిరేకం, మావిగన్‌కు కట్టుబడి ఉంటాం.. ఎన్నికల మానిఫెస్టోలో పెడతాం! బాబు పాలన అంటే మోసం గ్యారంటీ!... ఇలా ఆయా సబ్జెక్టులపై ఒక స్పష్టతతో, ఆధారాలతో జగన్ పంచ్ డైలాగులు విసిరారు.

హే రామ్.. అన్నది జాతిపిత మహాత్మా గాంధీ వాడిన మాట. ఏపీని రాముడే రక్షించాలని జగన్ వ్యాఖ్యానించారన్న మాట. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతోందని సోదాహరణంగా వివరించారు. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయిన తీరు, పోలీసుల వ్యవహార శైలి, సీసీ టీవీ ఫుటేజీ గల్లంతైన వైనం, రైతుల కష్టాలు పరిశీలించడానికి అమరావతి వెళ్లబోయిన వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేయడం, ఆ క్రమంలో ఒక కానిస్టేబుల్‌ను టీడీపీ కార్యకర్త ఒకరు రాయితో గాయపరచడం వంటి అంశాలను డిటైల్డ్‌గా ప్రస్తావించారు.

చట్టాన్ని పోలీసు వ్యవస్థ చేతిలోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తోందని చెబుతూ సాయికృష్ణ మృతి కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు ఆదారంగా ఆరోపణలు చేశారు. సాయికృష్ణను చంపి, దహనం చేసి, బూడిదను కూడా ఇవ్వకుండా 46 రోజుల పాటు కేసును కప్పిపెట్టేశారని ఆయన అన్నారు. తాను వెళ్లి సాయికృష్ణ తల్లిని పరామర్శించిన తర్వాత కానీ ప్రభుత్వం కదలలేదని, తదుపరే బాధ్యుడైన సర్కిల్ ఇన్‌ స్పెక్టర్‌పై చర్య తీసుకోవడం ఆరంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 18 నెలల సీసీ టీవీ ఫుటేజీ పోలీస్ స్టేషన్‌లో మిస్ అయితే కమాండ్ కంట్రోల్ రూమ్‌లో, డీజీపీ ఆఫీస్‌లో బ్యాకప్‌ ఉండదా అని ప్రశ్నించారు.

పోలీస్ కమిషనర్‌ను రక్షించడానికి డీజీపీ, ఈయనను రక్షించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. ఈ అంశాలపై చంద్రబాబు నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు. చనిపోయిన వ్యక్తి కాపు, పోలీసు కాపు అని అంటూ, కుల రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అంతటితో ఆగకుండా ఒక్కోసారి రౌడీల ప్రవర్తనతో పోలీసులకు ఫ్రస్టేషన్ వస్తుందని అని అన్నారు. ఇది పోలీసులు లాకప్ డెత్ ఘాతుకాలకు పాల్పడితే సమర్థించడం అవ్వదా! ఒక సీఎం ఇలా వ్యవస్థ నేరాలను ప్రోత్సహించవచ్చా? ఇక్కడే ఆయన బలహీనత కనిపిస్తుంది. సీసీటీవి ఫుటేజీ మాయం, రౌడీషీటర్ అయినంత మాత్రాన పోలీసులకు చంపే హక్కు ఉంటుందా? అంటూ జగన్ వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు.

ఇద్దరి వాదనలు విన్న తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులో తప్పు చేసినట్లు పరోక్షంగా అంగీకరించినట్లే అనుకోవచ్చనిపిస్తుంది. జగన్ ఆ రకంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారని అనుకోవచ్చు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సెంటిమెంట్ డైలాగులు వాడే యత్నం చేశారు. చివరికి పవన్ కళ్యాణ్‌ను, ఆయన కుమార్తెను సోషల్ మీడియాలో దూషిస్తున్నారని అంటూ సంబంధం లేని వ్యాఖ్య చేశారు. నిజానికి అలా ఎవరైనా చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు. మధ్యలో పవన్‌ కళ్యాణ్‌ కుమార్తెను కూడా ఈ రాజకీయ రొంపిలోకి తీసుకురావడం చంద్రబాబు వంటి సీనియర్‌కు తగునా అన్న ప్రశ్న వస్తుంది.

జగన్‌ను తాను అనుకుంటే ఒక్క నిమిషంలో అరెస్టు చేయవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించడం అర్దవంతంగా లేదని చెప్పాలి.  ఒక టీడీపీ ఎమ్మెల్యే దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు నిలువరించడం లేదని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. సమాజంలో విద్వేషాలు పెంచుతుంటే చర్య తీసుకోలేకపోతున్నారని జగన్ విమర్శించారు. డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించకుండా కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో  ఒక సామాజికవర్గం వారితో గొడవజరుగుతున్న తీరును జగన్ వివరించారు. ఈ అంశంలో చంద్రబాబు ఇంతవరకు నోరు మెదిపినట్లు కనిపించలేదు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్‌లు కల్పించే విషయంలో టీడీపీ వైఖరి ఏమిటని కూడా జగన్ అడిగారు. దానికి టీడీపీ వైపు నుంచి జవాబు లేదు.

అమరావతిలోని కొన్ని గ్రామాల రైతులు  ప్రభుత్వం వేదిస్తున్న తీరుపై జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి పరిశీలించడానికి వెళుతున్న వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీకి చెందిన వారు గూండాయిజం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల కార్లు ధ్వంసం చేశారు. ఇంత చేసిన టీడీపీ వారిపై కాకుండా వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడం మీద జగన్ మండిపడ్డారు. బాదితులపైనే కేసులు పెడతారా అని నిలదీశారు. అమరావతిలో అవినీతిని, దోపిడీని ప్రశ్నించే గొంతులను చంద్రబాబు నొక్కేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

అలాగే అమరావతిలో జరుగుతున్న అవినీతిని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం తన భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు నాలుగైదు వేల రూపాయలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తన భవనాల నిర్మాణానికి రూ.20,439 రూపాయలు ఎలా ఖర్చు పెడుతోందని ప్రశ్నించారు. ఇదంతా అవినీతి కాదా? అని ఆయన అడిగారు. అమరావతికి వెళుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు అక్కడికి రాకూడదని ముఖ్యమంత్రి, ఇతర టీడీపీ నేతలు అనడాన్ని ఆయన తప్పు పట్టారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ అవినీతికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. బాధితులపైనే కేసులు పెట్టడం ఒక అలవాటుగా ప్రభుత్వం మార్చుకుందని, ఇది జంగిల్ రాజ్‌గా మారిందని ఆయన అన్నారు.

ఎన్టీ.రామారావు బతికి ఉంటే, గతంలో చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆయనపై కూడా చంద్రబాబు సర్కార్ రౌడీ షీట్ పెట్టి ఉండేదేమోనని జగన్ ఎద్దేవ చేశారు. నిజంగానే ఈ రెండేళ్లలో విపక్ష వైఎస్సార్‌సీపీ నేతలపైన, కార్యకర్తలపైన, సోషల్ మీడియా వారిపైన, జర్నలిస్టులపైన, ఎవరు ప్రశ్నిస్తే వారిపై రెడ్ బుక్ అంటూ అరాచకంగా కేసులు పెడుతున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా మార్చిందన్న విమర్శలు జనం నుంచి కూడా వస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అక్రమాలను కూడా జగన్ ప్రస్తావించి ఓట్లు కోల్పోతే పేదలకు స్కీముల పరిస్థితి ఏమిటని అన్నారు. దీని గురించి టీడీపీ ఎటూ మాట్లాడదు.

అమరావతి విషయంలో జగన్ విస్పష్టమైన ప్రకటన చేసి చంద్రబాబుకు సవాల్ చేయడం కూడా సరికొత్త పరిణామంగా భావించాలి. అవినీతికి ఆస్కారం లేకుండా రెడీమేడ్‌గా ఉన్న మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని ప్రకటన చేశారు. నిజానికి ఇలా చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. దీనికి ముఖ్యమంత్రి అమరావతిలో అవినీతి లేదని గట్టిగా జవాబు ఇవ్వలేకపోయారు. కేంద్ర నిర్మాణ వ్యయానికి, రాష్ట్ర నిర్మాణ వ్యయానికి ఇన్ని రెట్ల తేడా ఎందుకు ఉందో, అదంతా అవినీతి అవుతుందా? అవ్వదా అన్నదానిపై వివరణ ఇవ్వలేకపోయారు.

నాడు మూడు ముక్కలు, ఇప్పుడేమో మావిగన్ అని కామెంట్ చేస్తూ మావవిగన్ అంటే అర్థం ఉందా అని మాత్రమే ఆయన అన్నారు. అమరావతికి, మావిగన్‌కు ఉన్న తేడా ఏమిటో జగన్ చెబుతుంటే, చంద్రబాబు మాత్రం ఆ కోణంలో చెప్పలేకపోతున్నారు. తొలుత ఏభై వేల ఎకరాలు సేకరించడం, మళ్లీ మరో ఏభై వేల ఎకరాలు రెండో దశ కింద సేకరించే యత్నం, లక్ష కోట్ల పైగా ఖర్చు పెట్టడానికి సిద్దం అవడం, ఇప్పటికే సుమారు ఏభైవేల కోట్ల అప్పు చేయడం, ఇతర హామీలను అమలు చేయకపోవడం వంటివాటిపై ప్రజలకు సమాధానం చెప్పగలిగి ఉంటే చంద్రబాబుకు కొంతైనా విశ్వసనీయత వచ్చేది. ఆయన ఆ పని చేయలేకపోతున్నారు. దానికి కారణం ఒకే చోట లక్షల కోట్ల ఖర్చు పెడుతున్న వైనంపై ఏపీ ప్రజలలో వ్యతిరేకత వస్తుండడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యల నేపథ్యంలో జగన్ హే రామ్.. సేవ్ ఆంధ్ర అని వ్యాఖ్యానించారు. అందులో తప్పేముంది!


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement