హుజూరాబాద్‌ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ | Huzurabad Bypoll: Officials Returned Candidates Who Came Without Proper Nomination‌ Papers | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ

Oct 5 2021 9:55 AM | Updated on Jul 28 2022 7:29 PM

Huzurabad Bypoll: Officials Returned Candidates Who Came Without Proper Nomination‌ Papers - Sakshi

పత్రాలు సరిగా లేకపోవడంతో అడ్డుకుంటున్న పోలీసులు 

సాక్షి, కరీంనగర్‌/హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో నామినేషన్లు వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు పోటెత్తుతున్నారు. అయితే.. వారిలో పోటీ చేసేందుకు ఉత్సాహం ఉన్నా.. సరైన విధానంలో పత్రాలు తీసుకురావడంలో విఫలమవుతున్నారు. సోమవారం ఇదే విధంగా నామినేషన్‌ వేసేందుకు హుజూరాబాద్‌ వచ్చిన పలువురు అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. నూర్జహాన్‌ బేగం అనే మహిళ హైదరాబాద్‌ నుంచి వచ్చారు. సుపరిపాలన ధ్యేయంగా తాముపోటీ చేస్తున్నామని తెలిపారు. కానీ.. ఆమెను సమర్థిస్తూ పది మంది స్థానికుల సంతకాలు కావాలని అధికారులు సూచించడంతో తీసుకువస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
చదవండి: అయ్యయ్యో.. వద్దమ్మా! డబ్బులు తీసుకోం గానీ, సుపరిపాలనతోనే సుఖీభవ

►జమ్మికుంటకు చెందిన ప్రజాయుక్త పార్టీ/ఇండిపెండెంట్‌ సిలివేరు శ్రీకాంత్‌ సోమవారం రెండుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఈయన నామినేషన్‌ను సాంకేతిక కారణాలతో తిప్పిపంపిన విషయం తెలిసిందే.
►మురుగు రామచంద్రు కూడా నామినేషన్‌ వేసేందుకు లోపలికి వెళ్లారు. కానీ.. సాంకేతిక కారణాలతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు.
►ఎంఐఎం (టీఎస్‌) పార్టీ నుంచి తాహెర్‌ కమాల్‌ కుంద్‌మిరీ నామినేషన్‌ వేయడానికి వచ్చినా.. స రైన పత్రాలు లేవని అధికారులు తిప్పిపంపారు.
చదవండి: కేసీఆర్‌ డిపాజిట్‌ పోవడం ఖాయం: ఈటల

► హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని అన్నారు. ఇతను దరఖాస్తు కూడా అధికారుల ఆమోదం పొందలేదు.
► నామినేషన్లు దరఖాస్తులు తీసుకుంటున్న ఆర్డీవో కార్యాలయానికి మాస్కులు లేకుండా వచ్చి కొందరు విధులకు ఆటంకం కలిగించారని ఆర్‌ఐ సతీశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.
►సోమవారం ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల జమున (ఒక సెట్‌), సిలివేరు శ్రీకాంత్‌ (రెండు సెట్లు), రేకల సైదులు (రెండుసెట్లు) మొత్తం ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
చదవండి: హుజూరాబాద్‌: పోటీకి 1,000 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు

పకడ్బందీగా నియమావళి అమలు
హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్‌ ఓం ప్రకాశ్‌ ఐఏఎస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం హుజూరాబాద్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం, హుజూరాబాద్‌ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్‌ కమ్‌ రిసెప్షన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ కర్ణన్‌తో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంటుందని, ఓటర్లను ప్రలోభపెట్టేలా డబ్బు, నగదు, బహుమతుల పంపిణీని నివారిస్తామన్నారు.
చదవండి: Huzurabad Bypoll: రసవత్తరంగా మారిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక

నియోజకవర్గ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల వద్ద వాహనాలను చేస్తామన్నారు. అభ్యర్థులు పెట్టే ఖర్చుల వివరాలను ఎక్స్‌ పెండీచర్‌ బృందాలు రోజూ నమోదు చేయాలని ఆదేశించారు. ఉపఎన్నిక పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఉల్లంఘనపై ఫిర్యాదులు ఉంటే తనకు 6281552166 నెంబర్‌కు సమాచారం అందించాలని, ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు తనను కరీంనగర్‌లోని ఎక్సైజ్‌ భవన్‌ అతిథి గృహంలో కలవచ్చనని ఓం ప్రకాశ్‌ సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement