
సాక్షి, సూర్యాపేట: మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. 2004లోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిపోయిందన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది అనడం హాస్యాస్పదం అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం. టీడీపీ మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకు?. 2004లోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 26వేలలోపే ఉంది. 2014 నుంచి ఆంధ్రలో చంద్రబాబు ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకుపోయాయి.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ నాడు తెలంగాణాలో 1.12 లక్షల తలసరి ఆదాయం ఉంటే.. కేసీఆర్ పాలనలో 3.70 లక్షలకు వచ్చింది. చంద్రబాబు.. నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే.. ఏపీ ఆదాయం ఎందుకు పెరగడం లేదు?. ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదా?. ఎందుకు అభివృద్ధి చేయడం లేదు. ఎప్పటికైనా హైదరాబాద్కు రావాల్సిందే కాబట్టి ఆంధ్రను వాడుకుని వదిలేద్దామనుకుంటున్నావా?. చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి’ అని వ్యాఖ్యలు చేశారు.
