
హనుమకొండ: హనుమకొండలో ఈనెల 8న జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో.. అని బండి సంజయ్కుమార్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు జన సమీకరణపై ఆదివారం సాయంత్రం హనుమకొండలో సమావేశం జరిగింది. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ ప్రచారం జరుగుతోందని.. వాస్తవమేనా? అని బండి సంజయ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. బండి వల్లే రాష్ట్రంలో బీజేపీ గ్రామీణ స్థాయి వరకు విస్తరించిందని.. ఆయన పోరాట స్ఫూర్తితోనే గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల అరాచకాలను ఎదుర్కొనగలుగుతున్నాం.. ప్రజల్లో గౌరవం పెరిగింది అని కార్యకర్తలు స్పష్టం చేశారు. మీరే అధ్యక్షుడిగా కొనసాగాలి.. అని కన్నీటి పర్యంతమయ్యారు. మీ కష్టం వృథా కాదు.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మీకే ఉంటాయి.. అని కార్యకర్తలు బండి సంజయ్కుమార్కు బాసటగా నిలిచారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ కార్యకర్తలకు చెప్పారు.