ధర్మపురి: ముప్పైఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజల సమస్యకు 11 కేవీ విద్యుత్ లైన్తో పరిష్కారం లభించిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురిలో నూతనంగా ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్ లైన్ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. శ్రీరాములపల్లె నుంచి ధర్మపురి వరకు రోడ్డు పక్కనున్న ఇళ్ల మీదుగా 11 కేవీ లైన్ పోవడంతో చాలా ప్రమాదాలు జరిగాయని, బాధిత కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం సమస్యను పరిష్కరించామని వివరించారు. ధర్మపురిలో బస్డిపో ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. అలాగే నియోజకవర్గంలో విద్యుత్ షాక్తో మృతిచెందిన గేదెలకు నష్ట పరిహారం కింద ఐదుగురు రైతుల కుటుంబాలకు రూ.1.67 లక్షల విలువ గల చెక్కులను మంత్రి అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, ఏఎంసీ చైర్మన్ చిలుముల లావణ్య, నాయకులు ఎస్.దినేశ్, వేముల రాజు, ట్రాన్స్కో ఎస్ఈ సుదర్శనం, కౌన్సిలర్లు తదితరులున్నారు.
శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి
పెగడపల్లి(ధర్మపురి): ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కమార్ అన్నారు. మండలంలోని అయితిపల్లి, ఎల్లాపూర్ రామాలయాల్లో శుక్రవారం జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. రాత్రి నంచర్లలో జరిగిన స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రజలపై రాముని ఆశీస్సులు ఉండి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు అంజమ్మ, రాజేశం, రమణాకర్, మాజీ జెడ్పీటీసీ రాజేందర్రావు తదితరులు పాల్గొన్నారు.


