రామగుండం: ఓ రిటైర్డ్ హెచ్ఎం తండ్రి పేరిట ఉన్న నగదును దేశ రక్షణ నిధికి జమ చేసి దేశంపై ఉన్న అభిమానాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్లోని నూజివీడుకు చెందిన కోట వెంకటశివశాస్త్రి రామగుండం హైస్కూల్లో సుదీర్ఘకాలం హెచ్ఎంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు. తన తండ్రి ప్రఖ్యాత హరికథా భాగవతార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చిదానందశాస్త్రి వయోభారంతో 2024 సెప్టెంబర్లో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి పేరిట ఉన్న రూ.లక్ష నగదును సోమవారం భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని నూజివీడు ఎస్బీఐ బ్యాంకులో దేశ రక్షణ నిధి అకౌంట్ నంబర్కు డిపాజిట్ చేశారు. ఈ విషయమై సదరు రిటైర్డ్ హెచ్ఎం తన పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. రిటైర్డ్ హెచ్ఎంకు పూర్వ విద్యార్థులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు.
రిటైర్డ్ హెచ్ఎం నిర్ణయంపై హర్షం


