
వేగవంతంగా బియ్యం పంపిణీ
● ఈ పాస్ యంత్రంలో మార్పులు ● అందుబాటులోకి వచ్చిన సౌకర్యం ● ఒకేసారి వేలిముద్ర వేస్తున్న రేషన్ లబ్ధిదారులు
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ వేగవంతమైంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న(బీపీఎల్) కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ వస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ఉచితంగా ప్రారంభించిన రేషన్ బియ్యం పంపిణీ ఇంకా కొనసాగుతోంది. అయితే, వర్షాకాలం కావడంతో రవాణాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన కేంద్రప్రభుత్వం.. లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసా.. ఈనెలలోనే పంపిణీ చేస్తోంది. ఇందుకోసం లబ్ధిదారులు ఆరుసార్లు ఈపాస్యంత్రంపై వేలిముద్రలు వేయాల్సి వచ్చేది. తద్వారా బియ్యం పంపిణీలో తీవ్రజాప్యమైంది. దీనిని నివారించేందుకు అధికారులు ఈపాస్ యంత్రంలో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడంతో లబ్ధిదారులు ఒకేసారి వేలిముద్ర వేస్తున్నారు. తద్వారా జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ వేగవంతంగా సాగుతోందని డీసీఎస్వో రాజేందర్ తెలిపారు.
జిల్లాలో 413 రేషన్ దుకాణాలు..
జిల్లా వ్యాప్తంగా 413 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో ఏటా వర్షాకాలంలోనూ ప్రతీనెల రేషన్ బియ్యం పంపిణీ చేసేవారు. అయితే, బియ్యం తరలింపులో జాప్యం, భారీవర్షాలు, వరదలకు లబ్ధిదారులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడేవారు. ఈసారి ఇలాంటి సమస్యలు తలెత్తవద్దనే ఉద్దేశంతో మూడు నెలలకు సరిపడా(వర్షాకాలం పూ ర్తయ్యే వరకూ) రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. అయితే, పాతసాఫ్ట్వేర్ కావడంతో ఒక లబ్ధిదారు ఆరుసార్లు ఈ పాస్యంత్రంపై వేలిముద్ర వేయడంతోపాటు, పంపిణీలో, ఇతర సాంకేతిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో రోజుకు ఇద్దరి నుంచి నలుగురు లబ్ధిదారుల వరకే బియ్యం పంపిణీ చేయాల్సి వచ్చేది. దీంతో రేషన్కార్డుదా రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
30వ తేదీ వరకు బియ్యంపంపిణీ
మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో పంపిణీ, రవాణా, ఇత రత్రా సాంకేతిక సమస్యలు రావడంతో ఈనెల 30వ తేదీ వరకూ బియ్యం పంపిణీ చేసేందుకు గడువు పెంచారు. మొన్నటివరకు ప్రతీనెల 15వ తేదీ వరకే రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ చేసే వారు. ఆ తర్వాత బియ్యం మిగిలి ఉంటే.. ఆ ని ల్వల సమాచారంపై రేషన్ డీలర్లు ప్రభుత్వానికి, రెవెన్యూ అధికారులకు నివేదిక అందజేశారు. జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 2,23,553 ఉన్నా యి. ఇప్పటివరకు 1,03,553 కార్డులపై బియ్యం పంపిణీ చేశామని అధికారులు వివరిస్తున్నారు.
జిల్లా సమాచారం
మొత్తం రేషన్ కార్డులు 2,23,553
మొత్తం యూనిట్లు 6,66,912
రేషన్ దుకాణాలు 413
ఇబ్బందులు లేవు
ఈ పాస్ యంత్రంలోని సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు. దీంతో రేషన్ బియ్యం పంపిణీలో డీలర్ల సమస్యలు తొలగిపోయాయి. నెట్వర్క్ సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం వేగవంతమైంది. ఈనెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తాం.
– రాజేందర్, డీసీఎస్వో

వేగవంతంగా బియ్యం పంపిణీ

వేగవంతంగా బియ్యం పంపిణీ