
విచారణ చేపడుతున్న డీపీవో దేవరాజ్
గొల్లపల్లి: మండలంలోని శ్రీరాములపల్లెలో డీపీవో దేవరాజ్ విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన కుడుకుల లావణ్య తన సొంత పట్టా భూమిలో ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శికి ఆర్నెళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది. కార్యదర్శి అనుమతి ఇవ్వకపోవడంతో బాధితురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు డీపీవో పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. బాధితురాలు తన డాక్యుమెంట్లు, ఇంటినిర్మాణ మ్యాప్, ఇతర పత్రాలను ఆయనకు చూపించారు. వాటితో ఆర్నెళ్ల క్రితం సమర్పించానని, అయినా అనుమతి ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. తన భర్త ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉండగా. మహిళనని చూడకుండా నిత్యం జీపీ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడని గోడు వెళ్లబోసుకుంది. ఆమె వాగ్మూలాన్ని రికార్డు చేసుకున్న డీపీవో కలెక్టర్కు నివేదిక సమర్పిస్తానని పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని డీపీవో దేవరాజ్ తెలిపారు. ఆయన వెంట ఎంపీవో సురేష్రెడ్డి ఉన్నారు.