పార్వతీపురం: జిల్లాలో కొనసాగుతున్న భవన నిర్మాణాలు, అభివృద్ధి పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సంబంధిత శాఖాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రగతిలో ఉన్న పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. జూన్ 12 నాటికి పూర్తయిన భవనాలను వెంటనే ప్రారంభించి, సంబంధిత శాఖలకు అప్పగించాలని ఆదేశించారు. వన్స్టాప్ సెంటర్ భవన నిర్మాణం పనులు వేగవంతం చేసి జూన్ 30లోగా అప్పగించాలన్నారు. పనుల పురోగతిపై వారానికి ఒకసారి నివేదికలు సమర్పించాలని సూచించారు.
టెట్ తప్పనిసరి తీర్పును పునఃపరిశీలించాలి
విజయనగరం అర్బన్: ఇన్సర్వీసు టీచర్లకు టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణత తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.మదన్మోహన్, పి.శ్రీనివాస్లు ఓ ప్రకటనలో శనివారం విజ్ఞప్తి చేశారు. గత 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు టెట్ రాయాల్సిన అవసరం లేదని గతంలో ఎన్సీటీఈ(జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి)తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయని గుర్తు చేశారు. అయినా సుప్రీం ధర్మాసనం మాత్రం ఇన్సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపును ఇవ్వకపోవడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. మరోసారి తీర్పుపై పునరాలోచన చేయాలని, టెట్ నుంచి ఇన్సర్వీసు టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.
కలెక్టర్ ప్రభాకరరెడ్డి


