● ఒకే వేదికపై 30 మంది
ఉపాధ్యాయులకు సన్మానం
చీపురుపల్లి: సాధారణంగా బదిలీ జరిగిన వారినో.. ఉద్యోగోన్నతి పొందిన వారినో సత్కరించుకోవడం ఆనవాయితీ. అలాగే ఇటీవల కాలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరిట విద్యార్థులు ఒక్కటై తమకు విద్య బోధించిన ఉపాధ్యాయులను సన్మానిస్తున్నారు. తాజాగా వీటికి భిన్నంగా మండలంలోని బైరెడ్డిపేట వాసులు మాత్రం తమ పాఠశాలలో నాలుగు దశాబ్దాలుగా బోధించిన ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సత్కరించడం విశేషం. బైరెడ్డిపేటలో 1986లో ప్రాథమిక పాఠశాల ఏర్పాటైంది. ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఇంతటి విశేషమున్న ఈ పాఠశాలలో అప్పటి నుంచి పని చేసిన ఉపాధ్యాయులను సత్కరించాలని ప్రస్తుత హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు గోపి సంకల్పించారు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు కూడా తెలియజేయడంతో వారు కూడా సహకరించారు. దీంతో పాఠశాల ఏర్పాటు నుంచి నేటి వరకు పని చేసిన ఉపాధ్యాయుల వివరాలు సేకరించారు. కొంతమంది వివరాలు తెలియకపోయినప్పటికీ, దాదాపు 30 మంది ఉపాధ్యాయులను గ్రామానికి తీసుకువచ్చి ఘనంగా సత్కరించారు. అలాగే ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పలువురు విద్యార్థులను సైతం సన్మానించారు. కార్యక్రమంలో గ్రామస్తులంతా ఒక్కటై పాల్గొన్నారు.


