న్యూస్రీల్
–8లో
శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● ఉత్కంఠ రేపుతున్న ఐపీఎల్ మ్యాచ్లు
● యువతను బెట్టింగ్ ఉచ్చులోకి దించుతున్న బుకీలు
● ‘యాప్’లతో వల
● డబ్బుపోగొట్టుకుని విలవిల్లాడుతున్న బాధితులు
● ఉచ్చులో చిక్కుకోవద్దంటూ హెచ్చరిస్తున్న పోలీసులు
తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టేందుకే..!
వడ్డించే వాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా మంచి భోజనం అందుతుందనే సామెత చందాన తయారైంది టీడీపీ సర్కారు తీరు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
బెట్టింగ్లకు పాల్పడినా.. ఇతరులను ప్రోత్సహించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిఘా పెట్టాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వలలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు.
– ఎ.ఆర్.దామోదర్,
ఎస్.వి.మాధవ్రెడ్డి, విజయనగరం,
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీలు
విజయనగరం/పార్వతీపురం రూరల్:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ఇటీవల ఆరంభమైంది. రెండు నెలలపాటు సాగే క్రికెట్ మ్యాచ్లు యువతలో ఉత్కంఠ రేపుతున్నాయి. మ్యాచ్లను ఆసక్తిగా తిలకిస్తూ.. తమ అభిమాన జట్టు గెలుస్తుందన్న ధీమాతో బెట్టింగ్లు కాసేందుకు కొందరు ఉత్సుకత చూపుతున్నారు. దీనినే ఆసరాగా తీసుకుని పలువురు బుకీలు రంగంలోకి దిగారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన యువతకు ఆన్లైన్, ‘యాప్’లతో వల విసురుతున్నారు. టాస్ నుంచి బంతిబంతికీ బెట్టింగ్ కట్టేలా ఉచ్చులోకి దించుతున్నారు. నిలువునా దోచుకుంటున్నారు. బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు పట్టణాల నుంచి మారుమూల పల్లెలకు పాకడం ఆందోళన కలిగిస్తోంది.
ఆ మ్యాచ్లపైనే అధిక బెట్టింగ్లు
ఐపీఎల్ 75 మ్యాచ్ల టోర్నీలో హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ముంబయి జట్లపైనే అధికమంది బెట్టింగ్లు వేస్తున్నారు. బుకీలు కూడా ఇదే అదునుగా చేసుకుని క్రీడాభిమానులను ఊరిస్తున్నారు. బెట్టింగ్ కాసేవారిని ముంచేస్తున్నారు. కొన్నిసార్లు గెలిచినా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. అంతా అన్లైన్ కావడం, బెట్టింగ్ విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న భావనతో చాలామంది డబ్బులు గెలిచి నష్టపోయిన సమయంలోనూ మిన్నకుండిపోతున్నారు. కొందరు బెట్టింగ్లకు ఇళ్లు, వాహనాలను, ఆభరణాలను తాకట్టుపెడుతున్నారు.
అంతా గుప్చప్గా...
చైన్సె, బెంగళూరు, విశాఖపట్నం నుంచి బెట్టింగ్ మాఫియా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు వచ్చి హోటళ్లలో బస చేస్తున్నారు. బెట్టింగ్ల కోసం యువతతో పల్లెలు, వార్డుల వారీగా ప్రత్యేక టీమ్లు ఏర్పాటుచేస్తున్నారు. రూ.100కు గెలిస్తూ రూ.1000, రూ.2000 ఇస్తామని ప్రత్యేక టీమ్లతో ఊరిస్తున్నారు. వాట్సాప్, వివిధ రకాల యాప్లలో బెట్టింగ్ మాఫియాను నడుపుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టిసారించినా వ్యవహారం గుప్చప్గా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
పోలీస్ శాఖ హెచ్చరికలు ఇలా...
క్రికెట్ అభిమానులు ఆటను ఆస్వాదించాలే తప్ప బెట్టింగ్లకు పోరాదు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దు.
బెట్టింగ్లు కాస్తున్న వారిలో యువతే అధికంగా ఉంటున్నారు. కొందరు స్వార్థపరులు, చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్లకు తెరలేపే అవకాశం ఉంది. వారి మాటలు వినరాదు.
బెట్టింగ్లో ఒకసారి ఆదాయం వచ్చినా ఎక్కువసార్లు నష్టపోవడం జరుగుతుంది. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి, చేసిన అప్పులను తీర్చడానికి యువత దొంగతనాలకు, ఇతర నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారన్నారు. బెట్టింగ్ అనేది పెనుభూతం లాంటిది. ఆశ చూపి అథ:పాతాళానికి నెట్టేస్తుంది. కుటుంబాలను రోడ్డుపాలుచేస్తుంది. కొందరి ప్రాణాలను సైతం తీస్తుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలి. బెట్టింగులకు పాల్పడుతుంటే వారికి నచ్చచెప్పి ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలి.
బెట్టింగ్ నిర్వాహకులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తాం. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నట్టు తెలిస్తే డయల్ 112/100 కు (లేదా) సంబంధిత పోలీస్ అధికారులకు కాల్చేసి సమాచారం అందించాలి. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
అంతా ఫోన్లోనే...
క్రికెట్ మ్యాచ్లను తిలకిస్తూనే బెట్టింగ్లో పాల్గొనేలా బుకీలు సెట్ చేస్తున్నారు. అంతా ఫోన్లోనే ప్రత్యేక కోడ్ భాషతో పందాలు కాయిస్తున్నాయి. ఎస్.. నో.. ఓకే..డన్..రిపీట్ వంటి పదాలు వాడుతున్నారు. యువత, ఉద్యోగులు, క్రికెట్ అభిమానులను ఊరిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఏ క్రికెటర్ ఎన్ని పరుగులు చేస్తారు.. ఆ ఓవర్లో ఎన్ని సిక్స్లు కొడతారు.. ఎన్ని వికెట్లు తీస్తారు.. ఎన్ని పరుగులకు జట్టు అవుట్ అవుతుందన్న అంచనాలపై బెట్టింగ్లు సాగుతున్నాయి. బంతిబంతికీ ఉత్కంఠ రేపుతూ పందెం కాయిస్తున్నారు. వాస్తవంగా టీవీల్లో మ్యాచ్లు చూసేవారికి కనీసం 10 నుంచి 30 సెకెన్ల తేడాతో లైవ్ వస్తుంది. ఒక్కో సారి రెండు బంతుల సమయం తేడా ఉంటుంది. అది తెలుసుకోకుండా బెట్టింగ్ కాసేవారి జేబులకు బుకీలు కన్నంవేస్తున్నారు. రూ.100 కడితే రూ.1000 ఇస్తామంటూ నమ్మించి పెద్ద మొత్తంలో సొమ్మును దోచుకుని నిలువునా ముంచేస్తున్నారు.
విజయనగరానికి చెందిన ఓ ఆటో డ్రైవర్కు క్రికెట్ అంటే పిచ్చి. ఆ విషయాన్ని బెట్టింగ్ మాఫియా నియమించిన ఏజెంట్ గుర్తించాడు. ఆయనలో బెట్టింగ్పై ఆసక్తి రేపాడు. రూ.100 కడితే రూ.1000 ఇస్తారని నమ్మించాడు. ఆయన ఏకంగా తన అభిమాన టీమ్ గెలుస్తుందని రూ.1,50,000 బెట్టింగ్ కాశారు. టీమ్ గెలవకపోవడంతో అప్పటికప్పుడు ఆటో విక్రయించి సొమ్ముచెల్లించాడు.
పార్వతీపురంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ యువ ఉద్యోగి క్రికెట్ అభిమాని. విషయం తెలుసుకున్న బెట్టింగ్ మాఫియా ప్రత్యేక యాప్లో వలవేసింది. బంతిబంతికీ బెట్టింగ్ కట్టేలా ఉచ్చులో దించింది. ఆయన నుంచి రూ.లక్ష వరకు లాగేసింది.
పాలకొండకు చెందిన ఓ యువకుడు తన అభిమాన జట్టుపై ఆన్లైన్లో బెట్టింగ్ కాశాడు. తను పందెం కాసిన జట్టు గెలిచింది. రూ.50,000 వస్తుందని ఆశపడ్డాడు. తీరా ఆ యువకుడికి రూపాయి ఇవ్వకుండానే బుకీలు మోసం చేయడంతో తన స్నేహితుల వద్ద గగ్గోలు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సాహసించలేకపోయాడు.


