విజయనగరం అర్బన్: సమగ్రశిక్ష ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు ఏపీ సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 15న విజయవాడలో వినూత్నరీతిలో నిరసనలు చేపట్టనున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖ మంత్రి లోకేశ్ నివాసం వరకు కుటుంబ సభ్యులతో కలిసి మహా పాదయాత్ర చేపడతామని ఎన్పీఆర్ భవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు ప్రకటించారు. న్యాయమైన డిమాండ్ల సాధనలో ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, హెచ్ఆర్పాలసీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, వేతనాల పెంపు, ఈపీఎఫ్, ఈఎస్ఈ, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఉద్యోగ విరమ ణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలన్నా రు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఐక్యంగా పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం మహాపాదయాత్రకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు.
సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, జిల్లా జేఏసీ వైస్ ప్రెసిడెంట్ తేజేశ్వరి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు జయగణేష్, కృష్ణమూర్తి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.


