సంతకవిటి: అనుమానమే పెనుభూతమై మామిడి చెట్లు నరికివేతకు దారితీసిన పరిస్థితి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మామిడిపల్లి గ్రామానికి చెందిన సవలాపురపు జోగులు(65) ఇటీవల కాలిన గాయాలతో మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. జోగులు మృతి విషయంలో ఆయన పొలం పక్కన ఉన్న మామిడి తోట యజమాని.. పుల్లిట గ్రామానికి చెందిన వ్యక్తే కారణమని భావించి మామిడి తోటను మృతుడు కుటుంబీకులు కొందరు నరికేసినట్టు తోట యజమాని భార్య పిన్నింటి స్వప్న బుధవారం రాత్రి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. ఇదిలా ఉండగా పుల్లిటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.


