● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి
పార్వతీపురం రూరల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల నేపథ్యంలో యువత ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగుల మాయాజాలంలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే స్వార్థపరుల ఆశల వలలో పడి బంగారు భవితను అంధకారం చేసుకోవద్దన్నారు. వినోదం పంచాల్సిన ఆటలు.. కుటుంబాల్లో విషాదం నింపేలా మారకూడదని హితవు పలికారు. బెట్టింగుల వ్యసనానికి బానిసలై అప్పులపాలవుతున్నారని, ఆ నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో కొందరు దొంగతనాలు, ఇతర నేరాల బాట పడుతుంటే.. మరికొందరు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోవాల్సిన వయసులో విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని సన్మార్గంలో పెట్టాలని కోరారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బెట్టింగ్లు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే డయల్ 112 లేదా 100 నంబర్లకు గానీ, స్థానిక పోలీసులకు గాని ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.


