పార్వతీపురం: ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అమలుపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వారికి అండగా నిలవడమే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రధాన ఉద్దేశమన్నారు. శ్మశాన వాటికల అవసరాలను గుర్తించి మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. కేసులు పెండింగ్లో వుంటే తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ శాఖ, సామాజిక సంక్షేమ, ఆదివాసీ సంక్షేమ విభాగాలు పరస్పరం సమన్వయంతో పని చేయాలన్నారు. చట్ట ఉల్లంఘన కలిగించే ఏచర్యనైనా కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బి.విజయచంద్ర మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పెదబొండపల్లి సందర్శించిన సందర్భంగా దళిత రైతులు ఆక్రమణలపై ఫిర్యాదు ఇచ్చినప్పటికీ చర్యలు లేవన్నారు. తొలుత జిల్లాలో కేసుల పురోగతిని, విచారణ తీరును, నిందితులకు ఖరారైన శిక్షలు తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నల్ జగన్నాధ్, డీఆర్ఓ కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.


