విజయనగరం: నగరంలోని ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో కల్తీ ఆహారాన్ని గుర్తించే విధానాలపై వినియోగదారుల సంఘ సభ్యులు, వలంటీర్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. జిల్లా సహాయ ఆహార భద్రత నియంత్రణాధికారి ఎస్.ఈశ్వరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న జిల్లా ఆహార భద్రత అధికారి పి.వెంకటరమణ మాట్లాడుతూ నిత్య జీవితంలో వినియోగించే పాలలో నీరు, యూరియా, స్టార్చ్, డిటర్జెంట్ వంటి హానిక పదార్ధాలు కలపబడే ప్రమాదాలపై వివరించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి స్వచ్ఛమైన ఆహారం అత్యవసరమన్నారు. ఇంటి వద్దే సులభమైన పరీక్షల ద్వారా పాలలో కల్తీని ఎలా గుర్తించవచ్చో సభ్యులకు వివరించారు. ఆహార పదార్ధాల్లో కల్తీకి పాల్పడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చికెన్, మటన్కు సంబంధించి ఫుడ్పై కలర్ కోటింగ్ వేయడం కూడా ఫుడ్ సేఫ్టీ ప్రకారం నేరమని స్పష్టం చేశారు. ఈ తరహా ఉల్లంఘనలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ శాఖ ఇన్స్పెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని, లేదా వాట్సాప్ ద్వారా ఫొటోలు పంపాలని సూచించారు. ఆహార భద్రత అధికారి నాగుల్ మీరా ఆహార భద్రత చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కాప్కో జనరల్ సెక్రటరీ హెచ్.ఎస్.రామకృష్ణ, విజయనగరం జిల్లా వినియోగ సమాచార కేంద్రం ఇన్చార్జ్ చదలవాడ ప్రసాద్, సీడ్ వాలంటీర్ సంస్థ తరఫున విజయనిర్మల, జనార్దనరావు, ఎం.వి.ఆర్.రాజు తదితరులు పాల్గొన్నారు.


