● టిడ్కో ఇళ్ల పంపిణీకి సీపీఎం డిమాండ్
పార్వతీపురం రూరల్: పట్టణంలోని నిరుపేదలకు 2017లో మంజూరైన టిడ్కో ఇళ్లను తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సీపీఎం నాయకులు వెల్లడించారు. టిడ్కో ఇళ్ల సాధనకై పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార యాత్ర గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా పట్టణంలోని మూడవ వార్డు పరిధిలోని పలు వీధుల్లో నాయకులు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. పార్టీ పట్టణ నాయకులు గొర్లి వెంకటరమణ, బి.వి.రమణ, బి.సూరిబాబు మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన 768 ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలని కోరారు. పార్వతీపురం జిల్లా కేంద్రమైన తర్వాత ఇంటి అద్దెలు పెరగడంతో పేదలపై ఆర్థిక భారం అధికమైందని పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితా లో ఉండి ఇళ్లు కేటాయించని వారికి, వారు చెల్లించిన షేర్ క్యాపిటల్ మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని లేదా ప్రత్యామ్నాయ గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. 31న జరిగే ధర్నాలో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి బి.లక్ష్మి, డీవైఎఫ్ఐ నాయకులు పి.రాజశేఖర్, స్థానిక నాయకులు చంద్రరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


