నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానాన్ని హైకోర్టు జడ్జి జస్టిస్ టీసీడీ శేఖర్ బుధవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి క్షేత్ర మహాత్యాన్ని వివరించారు.
ప్రముఖ న్యాయవాది
కోలగట్ల ఇకలేరు..
విజయనగరం క్రైమ్ : ప్రముఖ న్యాయవాది, ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ నేత కోలగట్ల తమ్మన్నశెట్టి(67) బుధవారం మృతి చెందారు. నగరంలో ఎస్వీఎన్ నగర్ సమీపంలోని మహాలక్ష్మినగర్లో తన స్వగృహంలో తమ్మన్నశెట్టి ఆత్మహత్య చేసుకున్నట్టు విజయనగరం టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన సోదరుడు స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. తమ్మన్నశెట్టికి ఇద్దరు కుమార్తెలు. వీరిద్దరూ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. తమ్మన్నశెట్టి మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సంతాపం తెలిపారు.
పార్వతీపురం రూరల్ : చదువులో ఒత్తిడి, ఇంటికి దూరంగా ఉండలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. బలిజిపేట మండలంలోని పలగర గ్రామానికి చెందిన కెల్లా దిలీప్ ఏలూరులోని ఒక ప్రైవేటు కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రథమ సంవత్సరంలో కొన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించలేకపోవడం, తోడుగా సొంత ప్రాంతానికి దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేక దిలీప్ కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నాడు. ఇటీవల సెలవులకు గ్రామానికి వచ్చిన ఆయన, బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.


