రైతుకు నిరాశ.. ప్రాజెక్టులకు మంగళం
బడ్జెట్లో అన్నదాతకు మొండిచేయి చూపారు. పావలా, సున్నా వడ్డీ ఊసు ఎత్తలేదు. పెట్టుబడి సాయంలోనూ భారీగా కోత విధిస్తోంది. కేంద్రం అందించే పీఎం కిసాన్ నిధులే దిక్కవుతున్నాయి. రాష్ట్ర సాయం మొదటి ఏడాదిలో పూర్తిగా ఎత్తివేసింది. గతేడాది నిధులు విడుదల చేసినా.. రైతుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత ప్రభుత్వంలో రైతుభరోసా కింద జిల్లాలో 1.46 లక్షల మందికి లబ్ధి చేకూరితే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక లబ్ధిదారుల సంఖ్యను 1.22 లక్షల మందికే పరిమితం చేశారు.
● జిల్లాలో సాగునీటి వనరులు అపారం. వాటిని సద్వినియోగం చేసుకోవడంలోనే వైఫల్యం కనిపిస్తోంది. ప్రాజెక్టులకు సంబంధించి పార్వతీపురం మన్యానికి ఎటువంటి కేటాయింపులూ లేవు. అరకొర నిధులు కేటాయిస్తున్నా.. ఖర్చులు ఉండటం లేదు. జిల్లాలో కీలకమైన తోటపల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు పెద్ద ఎత్తున నిధులు అవసరమైనా.. కేవలం రూ.47.89 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఈ మొత్తం సిబ్బంది జీతభత్యాలు, ఖర్చులకే సరిపోవు. ఆధునికీరణ లేకపోవడం వల్ల ఎడుమ కాలువ ద్వారా నీరు సాగడం లేదు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గతంలో సుమారు రూ.90 కోట్ల అంచనా విలువతో ప్రతిపాదించారు. ఇప్పుడు వ్యయం పెరిగింది. సుమారు రూ.230 కోట్ల వరకు అవసరం. కొమరాడ మండలంలో ఉన్న జంఝావతికి సంబంధించి చిన్నపాటి సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. ఒడిశా ప్రభుత్వంతో ఉన్న వివాదాన్ని పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం చొరవ చూపడం లేదు. వంశధారకు ఇచ్చిన ప్రాధాన్యం జంఝావతికి ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మన భూభాగంలో గతంలో తవ్విన కాలువలు పూర్తిగా పూడికలతో నిండిపోయాయి. డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టాలి. ఈ పనులకు రూ.57 కోట్ల వరకు అవసరం. జపాన్ నిధులతో గతంలో ఒట్టిగెడ్డ(రావాడ), సీతానగరంలోని పెదంకలాం కాలువల ఆధునికీకరణకు నిధులు కేటాయించారు. 23 శాతం లోపు కూడా పనులు పూర్తి చేయలేకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ఇది పాలకులు, అధికారుల తప్పిదమే. పెదంకాలం ఆధునికీకరణకు గతంలో రూ.8 కోట్లు అవసరమని ప్రతిపాదిస్తే.. కేటాయింపులు లేవు. ఇప్పుడు వ్యయం పెరిగి రూ.15 కోట్లకు చేరుకుంది. జిల్లాలోని మిగిలిన ప్రాజెక్టులూ ఆధునికీరణకు నోచుకోక, సక్రమంగా సాగునీరు అందించలేని పరిస్థితిలో ఉన్నాయి.
● వ్యవసాయంలో కీలకమైన మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలు లేవు. నిధులిచ్చి చేస్తేనేగానీ అవ్వదు. ఈ ఏడాది రబీలో పంట ఆశాజనకంగా ఉంది. రబీలో మొత్తం పంటల సాగు 31,665.8 ఎకరాలు కాగా.. అందులో మొక్కజొన్న 12,663.3 ఎకరాల్లో ఉంది. ఖరీఫ్ సీజన్లో క్వింటా రూ.800 నుంచి రూ.1,400కు మించి కొనుగోలు జరగలేదు. ప్రభుత్వ మద్దతు ధర పొందలేక సుమారు క్వింటాకు రూ.1,500 వరకు రైతు నష్టపోయాడు.
రైతుకు నిరాశ.. ప్రాజెక్టులకు మంగళం


