డంపింగ్ యార్డులో మంటలు
పార్వతీపురం రూరల్: డంపింగ్ యార్డును తరలిస్తాం..పట్టణానికి విముక్తి కలిగిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పుడు అగ్నిలో ఆహుతయ్యాయి. పట్టణ శివారులోని డంపింగ్ యార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం మంటలు చెలరేగాయి. తేలికపాటి చెత్త, పనికిరాని పేపర్లు, పాలిథిన్ కవర్లు కావడంతో క్షణాల్లో మంటలు వ్యాపించి, నిప్పుల కొలిమిని తలపించాయి. అక్కడి అంతర్రాష్ట్ర రహదారిపై దట్టమైన పొగ కమ్మేయడంతో వాహనదారులు ప్రయాణానికి ఇబ్బందులు పడ్డారు. చెత్తకుప్పల నుంచి ఎగసిపడే మంటలు, వ్యాప్తి చెందే పొగలు చూసి పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. నిండుగా పొగ కమ్మేయడంతో ఊపిరి పీల్చుకునేందుకు జనం ఇబ్బందులు పడ్డారు.
అధికారంలోకి రాగానే తరలిస్తామన్నారు..
అధికారంలోకి రాగానే డంపింగ్ యార్డును తరలిస్తామన్న చంద్రబాబు సర్కార్, ఆ హామీని గాలికి వదిలేసి ‘సాగ్రిగేషన్’ పేరిట ఓ ప్రైవేట్ సంస్థకు తలుపులు తెరిచింది. అనుమతి ఇచ్చిన 12 వేల టన్నుల్లో కేవలం ప్లాస్టిక్ను ఏరుకున్న సదరు సంస్థ, పనికిరాని 80 శాతం వ్యర్థాలు కొండల్లా అక్కడే వదిలేసింది. పర్యవేక్షణ లోపంతో ఆ వ్యర్థాలు కాస్త రోడ్డు పైకి చేరడం, ఇప్పుడు మంటలకు తోడవడంతో ప్రజల ఆరోగ్యం గాలిలో దీపమైంది. మరి ఇప్పటికై నా పాలకుల తీరుమారి, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తారో లేదో వేచి చూడాలి.
దట్టమైన పొగతో నిండిపోయిన అంతర్రాష్ట్ర రహదారి
ప్రయాణానికి ఇబ్బందులు పడిన వాహనదారులు
పొగ కమ్మేయడంతో పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు
డంపింగ్ యార్డులో మంటలు
డంపింగ్ యార్డులో మంటలు


