పాలకొండను జిల్లాగా ప్రకటించండి
● కలెక్టర్కు వినతిపత్రం అందజేత
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండను జిల్లాగా ప్రకటించాలని లేకుంటే శ్రీకాకుళం జిల్లాలోనైనా కలపాలని పాలకొండ జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి అధ్యక్షుడు కనపాక చౌదరినాయుడు, జిల్లా కోశాధికారి నానాజీ, మరికొందరు నాయకులు గురువారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు కావాల్సిన అన్ని వసతులు, నైసర్గిక, భౌగోళిక పరిస్థితులు పాలకొండకు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పాలకొండను జిల్లాగా ప్రకటించాలని ఈ మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు.
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
పాలకొండ: కార్తీకమాసంలో పంచారామాల దర్శనానికి పాలకొండ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేరోజు పంచారామాలను దర్శనం చేసుకునేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నామని తెలియజేశారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఈ దర్శనం కలిగేలా బస్సులు నడుపుతామని వివరించారు. రూ.2,500తో ఈ సౌకర్యం పొందవచ్చునని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఆర్టీసీ డిపోలో సంప్రదించాలని సూచించారు.
అంకుళ్లవలసలో ఏనుగుల గుంపు
కొమరాడ: మండలంలోని కుమ్మరిగుంట పంచాయతీ అంకుళ్లవలస గ్రామ సమీపంలో గజ రాజుల గుంపు సంచరిస్తోంది. దీంతో కుమ్మరి గుంట, కందివలస, రాజ్యలక్ష్మీపురం తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ఎవరిపై దాడి చేస్తాయోనని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలను నాశనం చేయడంతో పాటు ప్రాణనష్టం జరుగుతుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడినుంచి గజరాజు ల గుంపును తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పాలకొండను జిల్లాగా ప్రకటించండి


