ష్..సైలెన్స్ ప్లీజ్..!
● లైబ్రరీలకు బకాయిల భారం
● సమస్యల్లో శాఖా గ్రంథాలయాలు
● జిల్లాలో రూ.4 కోట్ల సెస్ బకాయి
● పట్టించుకోని పంచాయతీ, పురపాలకులు
రామభద్రపురం: కూటమి పాలనలో గ్రంథాలయాలు అలంకార ప్రాయంగా మారాయి. ప్రభుత్వం పట్టించుకోకుండా వాటి బలోపేతంపై నిర్లక్ష్యం వహించడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 41 గ్రంథాలయాలు ఉండగా వాటిలో 26 శాఖా గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. 7 గ్రంథాలయాలు అద్దెభవనాల్లో నడుస్తుంగా 8 ఉచిత అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయితే వాటిలో పలు గ్రంథాలయాల్లో మరుగుదొడ్లు, పాఠకులు చదువుకునేందుకు ఫర్నిచర్ వంటి కనీస మౌలికవసతులు లేవు. అలాగే ప్రధానంగా పోటీ పరీక్షల కోసం చదవడానికి అవసరమైన పుస్తకాలు లేవు. శాఖా గ్రంథాయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించక 010 ప్రకారం జీతాలు రాక వారు ఇబ్బందులు పడుతున్నట్లు ఈ నెల 22వ తేదీన జిల్లాలో పర్యటించిన ఏపీ గ్రంథాలయ పరిషత్ మెంబర్ రౌతు రామ్మూర్తినాయుడు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని పలు శాఖా గ్రంథాలయాలను సందర్శించి సమస్యలను గుర్తించారు.
పేదవిద్యార్థులకు శాపం
జిల్లాలో 41 గ్రంథాలయాలు ఉండగా వాటిలో నిత్యం వందల మంది పాఠకులు సేవలు పొందుతున్నారు స్థానిక సంస్థల నుంచి సెస్ సకాలంలో వసూలు కాకపోవడంతో గ్రంథాలయాల్లో అరకొరగా వసతులు ఉన్నాయి. ముఖ్యంగా పుస్తకాలు సైతం తగినస్థాయిలో లేవని పాఠకులు అంటున్నారు. వివిధ పోటీ పరీక్షలకు నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. వారిలో అత్యధిక శాతం మంది సామాన్య,పేద తరగతి అభ్యర్థులే ఉంటారు. వారికి పోటీ పరీక్షల పుస్తకాలు, పేపర్లు కొనే ఆర్థిక స్థోమత లేక సమీపంలోని గ్రంథాలయాలకు వెళ్లి చదువుకుంటారు. కానీ అక్కడ అరకొరగా పుస్తకాలు ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో రూ.4 కోట్ల బకాయి
విజ్ఞాన భాండాగారాలుగా పేరొందిన గ్రంథాయాలు ఆర్థిక సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానిక సంస్థల నుంచి రూపాయిలో ఎనిమిదిపైసలు చొప్పున గ్రంథాలయాలకు రావాల్సిన సెస్ పూర్తి స్థాయిలో వసూలు కాకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా గ్రంఽథాలయాల ఉనికి ప్రమాదంలో పడింది. జిల్లాలో దాదాపు రూ.4 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏటా ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నాయి.ఆ పన్నుల నుంచి లైబ్రరీలకు చెల్లించాల్సిన సెస్ వాటాను మాత్రం సక్రమంగా జమచేయడం లేదు. నింబధనల ప్రకారం ప్థానిక సంస్థలు వసూలు చేసిన పన్నుల్లో నుంచి 8 శాతం గ్రంఽథాలయాకు సెస్గా చెల్లించాలి. ఈ నింబధన అమలుకు నోచుకోకపోవడంతో గ్రంథాలయాలు ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. ఈ సెస్ ద్వారా వచ్చిన సొమ్ముతోనే గ్రంథాలయాల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు పుస్తకాలు, మ్యాగజైన్లు, దిన,వార,మాస పత్రికలను పాఠకులకు అందుబాటులో ఉంచే వీలుంటుంది. అయితే ఇటు సెస్ వసూలు కాకపోవడం, అటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రంథాలయాల సేవలు మొక్కుబడిగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ష్..సైలెన్స్ ప్లీజ్..!
ష్..సైలెన్స్ ప్లీజ్..!


