
వైభవంగా సహస్ర దీపారాధన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం వెండి మంటపం వద్ద సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మంటపం వద్దకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రత్యేక ఊయలలో ఆసీనులను చేశారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, రామగోపాలాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం రూరల్: మండలంలోని సంగంవలస గ్రామానికి చెందిన వివాహిత వర్రి జానకి శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న క్రమంలో నొప్పిని తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొంతుతున్నట్లు కేంద్రాస్పత్రి అవుట్ పోస్ట్ పోలీస్ అధికారి ఎన్. భాస్కరరావు తెలిపారు.