
పాలకొండలో దౌర్జన్యకాండ
అంత భయమెందుకు?
● మండల సమావేశానికి వెళ్లకుండా ఎమ్మెల్సీ విక్రాంత్, సభ్యులను అడ్డుకున్న పోలీసులు
● నిరంకుశ పాలనపై సభ్యుల మండిపాటు
పాలకొండ/పాలకొండ రూరల్: కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. అరాచక పాలనకు తెరలేపింది. పోలీసులతో దౌర్జన్యకాండను కొనసాగిస్తోంది. దీనికి పాలకొండ మండల సర్వసభ్య సమావేశానికి ప్రతిపక్ష సభ్యులను రానీయకుండా పోలీసులతో మంగళవారం సాగించిన దౌర్జన్యమే నిలువెత్తు నిదర్శనం. పాలకొండ మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకావాలంటూ ఈ నెల 6వ తేదీన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్తోపాటు ఎంపీటీసీలు, సర్పంచ్లకు అధికారంగా ఆహ్వానం పంపించారు. జెట్పీటీసీ పాలవలస గౌరీపార్వతి, వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, పలువురు సర్పంచ్లతో పాటు ఎమ్మెల్సీ విక్రాంత్ సమావేశానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్తుండగా గేటువద్దనే ఎమ్మెల్సీని డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు అడ్డుకున్నాయి. ఆహ్వానం మేరకే వచ్చానని ఎమ్మెల్సీ తెలియజేసినా ససేమిరా అన్నారు. జీడీఏ నుంచి తనకు వచ్చిన అనుమతి కాపీని పోలీసులకు చూపించినా వినిపించుకోలేదు. ఎంపీడీఓ అనుమతి ఇస్తేనే లోపలకు పంపిస్తామని డీఎస్పీ రాంబాబు స్పష్టం చేశారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన విక్రాంత్ను నెట్టేశారు. ఎంపీటీసీలు, సర్పంచ్లను సైతం గంటల తరబడి గేటువద్దనే నిలిపేశారు. పోలీసులు, అధికారుల తీరును నిరసిస్తూ సభ్యులు గేటు వద్దనే బైఠాయించి రాజ్యాంగంలోని నిబంధనలు పాటించాలంటూ డిమాండ్ చేశారు. జీఎడీ నుంచి వచ్చిన జీఓను అమలు చేయాలని కోరారు. ఆహ్వానం ఎందుకు పంపారో వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో ఎంపీడీఓను డీఎస్పీ పిలిపించి ఆహ్వానం పంపింది మీరే కదా... ఇప్పుడు ఎందుకు సమావేశానికి రానీయకుండా తమతో అడ్డగించారని ప్రశ్నించారు. దీనిపై ఆయన నీళ్లు నములుతూ పనిఒత్తిడిలో ఆహ్వానం పంపించేశానని, ఎమ్మెల్సీకి ఏ మండలంలో ఓటు హక్కు ఉంటే ఆ మండల సమావేశానికి మాత్రమే హాజరుకావాలని లిఖితపూర్వకంగా తెలియజేశారు. దీంతో అక్కడ నుంచి విక్రాంత్తో పాటు సభ్యులు వెనుదిరిగారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో పాటు పార్టీ కార్యకర్తలతో మండల సమావేశాన్ని మమ అనిపించారు. సభ్యులు కానివారితో సమావేశం నిర్వహిస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుందంటూ మండల వాసులు మండిపడ్డారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా...
యూరియా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, చాలామంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం, విద్యార్థులకు తల్లికివందనం అందలేదని, వీటిపై నిలదీస్తామన్న భయంతోనే సమావేశానికి రాకుండా ఆడ్డుకున్నారని ఎమ్మెల్సీ విక్రాంత్ ఆరోపించారు.
అధికారులను కూటమి నాయకులు బలిపశువులను చేస్తున్నారని, ఈ ఘటనపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు పెద్దల సభలో ప్రస్తావిస్తానన్నారు.
గ్రామాల్లో సమస్యలు పేరుకు పోయాయి. వాటిని ప్రశ్నించాల్సిన వేదిక మండల సమావేశం ఒక్కటే. అక్కడికి కూడా రానీయకుండా పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. అసలు ప్రజాసామ్యంలోనే మనం ఉన్నామా? అన్న సందేహం కలుగుతోంది.
– టి.నీరజ, సర్పంచ్, నవగాం
ఎంపీడీఓ కార్యాలయం గేటు బయటే ఉండిపోయిన మండల పరిషత్ సభ్యులు
మండల సమావేశంలో సమస్యలపై ప్రస్తావిస్తే కూటమి నాయకులు అవినీతి బయట పడుతుందని భయపడుతున్నారు. అందుకే అధిక సంఖ్యలో ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులను సమావేశానికి రాకుండా అడ్డుకున్నారు. మండలానికి వచ్చిన నిధులు అభివృద్ధికి కాకుండా వారి ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు.
– కనపాక సూర్యప్రకాష్రావు, వైస్ ఎంపీపీ

పాలకొండలో దౌర్జన్యకాండ

పాలకొండలో దౌర్జన్యకాండ

పాలకొండలో దౌర్జన్యకాండ

పాలకొండలో దౌర్జన్యకాండ