
పెట్రోల్ స్టేషన్ను ప్రారంభించిన డీఐజీ
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని చర్చివీధి కూడలి సమీపంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ స్టేషన్ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డీఐజీ..విజిబుల్ పోలీసింగ్కు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన 41 కొత్త ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భధ్రత, ట్రాఫిక్ రెగ్యులేషన్ విధులను విజిబుల్ పోలీస్ సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాకు ఈ ద్విచక్ర వాహనాలను ఆధునిక టెక్నాలజీతో రూపొందించి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ వాహనాల ద్వారా సైరన్, బ్లింక ర్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ చేసేందుకు రూపొందించారన్నారు. జిల్లాలో ట్రాఫిక్ సమస్య తరచూ ఏర్పడుతున్న నేపథ్యంలో ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో రహదారి ప్రమాదాలు కూడా జరుగుతున్న క్రమంలో ఈ వాహనాలను కేటాయించినట్లు తెలిపారు.
మినీ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ స్టేషన్ ప్రారంభం అనంత రం ఎస్పీ కార్యాలయంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయంలో సోషల్మీడియా, సైబర్సెల్, మినీ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించి సైబర్ సెల్, ఐటీకోర్ టీం, సిబ్బందితో చర్చించి వారు నిర్వహించే విధుల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురానా, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఎస్బీ సీఐ రంగనాథం, సీసీఎస్ సీఐ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.