
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
కొత్తవలస: మద్యానికి బానిసై విపరీతంగా తాగుతూ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం పెదనందిపల్లి గ్రామానికి చెందిన పల్లా గంగునాయుడు(45) మృతిచెందిన విషయం ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి కొత్తవలస సీఐ షణ్ముఖరావు తెలిపిప వివరాలిలా ఉన్నాయి. గంగునాయుడు, భార్య 15 సంవత్సరాల క్రితం మనస్పర్థలతో విడిపోయారు. దీంతో నాటి నుంచి ఆకతాయిగా తిరుగుతూ ఎక్కడైనా గొర్రెల మందలు ఉంటే వారి వద్దకు వెళ్లి అక్కడే ఉంటూ వారు పెట్టింది తింటూ ఉండేవాడు. ఈ క్రమంలో గంగునాయుడు ఆదివారం ఇంటి నుంచి వచ్చేసి కొత్తవలస మండలం గులివిందాడ గ్రామం సమీపంలో గల చెరువు దగ్గర గల గొర్రెల మంద వద్దకు వెళ్లాడు. తనవెంట తెచ్చుకున్న రెండు మద్యం సీసాల్లో ఒకటి పూర్తిగా తాగి పడిపోయాడు. దానికి తోడు విపరీతంగా కాస్తున్న ఎండ బారిన పడి మృతి చెందినట్లు సీఐ తెలిపారు. చెరువు వైపు వెళ్లిన పశువుల కాపరలు మృతదేహాన్ని చూసి గ్రామస్తులకు తెలపడంలో పోలీసులకు సమాచారం అందించారన్నారు. మృతుడి తమ్ముడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్సీకి మృతదేహాన్ని తరలించినట్లు సీఐ వివరించారు.