
నాడు నిశ్చింతగా అమ్మ ఒడి.. నేడు తల్లికి శఠగోపం
కూటమి అధికారంలోకి రాగానే ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలుంటే.. అందరికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందజేసిన అమ్మ ఒడి పథకాన్ని రద్దు చేశారు.
నాడు: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి పథకం లబ్ధి అందేది. జిల్లాలో ఈ పథకం కింద వేలాది మంది లబ్ధిదారులు గత ప్రభుత్వ హయాంలోనే రూ.493.28 కోట్ల మేర లబ్ధి పొందారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలనే తేడా లేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాన్ని గత ప్రభుత్వం వర్తింపజేసింది. ఆ డబ్బులు పిల్లల ఫీజులు, ఇతర అవసరాలకు ఉపయోగపడేవని తల్లిదండ్రులు చెబుతున్నా రు. ఇదే కాక.. విద్యాదీవెన కింద రూ.23.42 కోట్లు, వసతిదీవెన కింద రూ.15.84 కోట్లు చొప్పున వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఏటా క్రమం తప్పకుండా ఈ నిధులను విడుదల చేస్తూ, వారి చదువుకు ఆటంకం లేకుండా చూసుకునేది.
నేడు : తల్లికి వందనం పథకమని చంద్రబాబు ప్రభుత్వం శఠగోపం పెట్టింది. అందరు బిడ్డలకూ కాదు కదా.. కనీసం ఒక్కరికై నా రూపాయి విదల్చలేదు. ఇదిగో అదిగో అంటూ ఏడాది కాలయాపన చేసేశారు. ఈ విద్యాసంవత్సరంలోనైనా అమలు చేస్తారా? అని జిల్లాలోని దాదాపు 1,80,000 మంది అర్హులైన విద్యార్థుల తల్లులు ఎదురు చూస్తున్నారు. దీవెన డబ్బులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. చాలా పాఠశాలలు/కళాశాలలు హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విద్యార్థులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

నాడు నిశ్చింతగా అమ్మ ఒడి.. నేడు తల్లికి శఠగోపం