
అయిపోయిన ఉద్యోగాలకు.. టెండర్లు!
సాక్షి, పార్వతీపురం మన్యం: పెళ్లి జరిగిపోయింది.. ‘వడ్డింపు’ కూడా పూర్తయిపోయింది. కానుకల చదివింపులూ అయిపోయాయి. అంతా అయ్యాక.. ఆహ్వాన కార్డులు కొట్టిస్తే ఎలా ఉంటుంది? విద్యుత్ శాఖలో అదే పరిస్థితి నెలకొంది. ఏపీ ఈపీడీసీఎల్ పార్వతీపురం సర్కిల్ పరిధిలో టెండర్ ద్వారా లోడ్ మానిటరింగ్ సెల్ (ఎల్ఎంసీ) పోస్టుల భర్తీకి తాజాగా టెండర్ పిలిచారు. ఈ పోస్టులను తాత్కా లిక ప్రాతిపదికన కాంట్రాక్టర్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి రెండో కంటికి తెలియకుండా భర్తీ ప్రక్రియ కూడా ఎప్పుడో జరిగిపోయింది. గత ఏప్రిల్ నెలలో వీరు విధుల్లో చేరిపోవాలి. ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. 21 నెలల కాలానికి ఈ పోస్టులను తొలుత భర్తీ చేస్తామని చెప్పినా.. తర్వాత రెన్యువల్ చేసుకుంటూ వెళ్తారు. దీంతో పోస్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. కార్పొరేట్ కార్యాలయం అధికారి ఒకరు.. తమవారి కోసం ఒక పోస్టును అట్టిపెట్టుకోగా... మిగిలిన మూడు పోస్టులను జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి సొంతం చేసుకున్నారు. ఒక్కో పోస్టునూ రూ.10 లక్షల కు విక్రయించినట్లు భోగట్టా. తనకు తెలియకుండా.. తన నియోజకవర్గంలో ఎలా పోస్టులను నియమిస్తారని మరో ప్రజా ప్రతినిధి అభ్యంతరం చెప్పడంతో.. ఎవరికీ పోస్టింగులు ఇవ్వకుండా ఆగిపోయింది. ఇదే విషయమై.. గత నెల 25న ‘సాక్షి’ లో ఎల్ఎంసీ పోస్టు.. రూ.10 లక్షలు శీర్షికన కథనం ప్రచురితమైంది. టెండర్ పిలవకుండానే నియామకాలు గుట్టుగా చేసిన విషయాన్ని బయట పెట్టడంతో విద్యుత్ శాఖాధికారులు ‘కవరింగ్’కు సిద్ధమయ్యారు. తాజాగా స్కిల్డ్ (69), సెమీ స్కిల్డ్ (4), అన్ స్కిల్డ్(7) కింద పోస్టులను భర్తీ చేయడానికి టెండర్లను ఆహ్వానించారు. ఇందులోనే నాలుగు ఎల్ఎంసీ పోస్టులు ఉండడం గమనార్హం. అయిపోయిన పోస్టులకు మళ్లీ ఇప్పుడు టెండర్ పిలవడం చర్చనీయాంశంగా మారింది.
ఇక షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు..
ప్రస్తుతం విడుదల చేసిన టెండర్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటి పైనా ప్రజా ప్రతినిధుల కన్ను పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక్కో పోస్టుకు పెద్ద ఎత్తున ‘డిమాండ్’ పలుకుతోంది. రేషన్ డీలర్లు, అంగన్వాడీ పోస్టులను అంగట్లో పెట్టి విక్రయించిన మాదిరి.. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు లకూ రేట్ ఫిక్స్ చేసేశారు. చాలామంది నిరుద్యోగులు అడిగినంత ముట్టజెప్పేందుకు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. రోస్టర్ ప్రకారం ఇంటర్వ్యూ నిర్వహించి పోస్టులను భర్తీ చేస్తే కొందరికై నా న్యాయం జరిగే అవకాశం ఉంది.
సాక్షి కథనంతో మేల్కొన్న విద్యుత్ శాఖ
ఇప్పటికే సదరు పోస్టులు విక్రయించేసినట్లు ఆరోపణలు