
యోగాతో మానసిక ప్రశాంతత
పార్వతీపురం రూరల్: మనిషి శరీరాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు యోగా దోహదపడుతుందని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. మండలంలోని నర్సిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సుమారు 500 మంది పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొని యోగాసనాల్లో సాధన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో వృత్తిపరంగా అనేక ఒడిదుడుకులు, ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఉద్యోగ ప్రయాణంలో యోగాను భాగంగా చేసుకుని ఆరోగ్యంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత సిద్ధిస్తుందని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. కనీసం రోజులో 15 నిమిషాలైనా యోగాసనాలు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు రంగనాథం, అప్పారావు, శ్రీనివాసరావు, ఏఆర్ ఆర్ఐలు రాంబాబు, నాయుడు, శ్రీనివాసరావు, రూరల్ సీఐ గోవిందరావు, సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు, యోగా గురువులు, శిక్షకులు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ట్రైనీ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
యోగాంధ్రలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

యోగాతో మానసిక ప్రశాంతత