
యథేచ్ఛగా విద్యుత్ చౌర్యం
● పుట్టగొడుగుల్లా షాపులు
● సహకరిస్తున్న విద్యుత్ సిబ్బంది
● రెడ్డి కంచేరులో విద్యుత్కష్టాలు
● గ్రామానికి లోడు సరిపడక ప్రజలు అవస్థలు
భోగాపురం: మండలంలోని రెడ్డి కంచేరు గ్రామ ప్రజలు విద్యుత్ కష్టాలతో గడిచిన కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి అతి సమీపంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణమవుతోంది. ఇదే అదునుగా కొంతమంది అక్రమార్కులు గ్రామంలోని రహదారులను ఆక్రమించి పదుల సంఖ్యలో కొత్త షాపులను నెలకొల్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా..షాపులకు నిత్యం విద్యుత్ చౌర్యం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్కు కర్రలు కట్టి మరీ విద్యుత్ చౌర్యం చేస్తున్నారని, దీనివల్ల గ్రామానికి లోడు సరిపడక విద్యుత్ సరఫరాలో నిత్యం ఆటంకం ఏర్పడుతోందని వాపోతున్నారు. విద్యుత్ చౌర్యం పట్టపగలే బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు కనీసం స్పందించడం లేదని, షాపుల నిర్వాహకులకు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆరు ట్రాన్స్ఫార్మర్లు ఉండగా..గ్రామానికి విద్యుత్ సరఫరా అయ్యే ప్రధాన ట్రాన్స్ఫార్మర్ నుంచి కర్రలు కట్టి చౌర్యానికి పాల్పడుతున్నారని వాపోతున్నారు. దీంతో ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడుతోందని, వేసవి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులకు సహకరిస్తూ సుమారు 2వేల మంది జనాభా ఉన్న గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కర్రలు కట్టి యథేచ్ఛగా దొంగతనంగా విద్యుత్ను ఉపయోగించుకుంటున్నారు. మాకు సరఫరా సక్రమంగా అందివ్వడం లేదు. కానీ నెల నెలా బిల్లులు చూస్తే నిజంగానే షాక్ కొడుతోంది. గ్రామానికి మానేసి షాపులకు దొంగతనంగా విద్యుత్ను ఎలా సరఫరా చేస్తారు? విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. సీరపు అప్పలరాముడు, రెడ్డి కంచేరు
నరకయాతన అనుభవిస్తున్నాం
ప్రతిరోజూ విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడుతుండడంతో నరకయాతన అనుభవిస్తున్నాం. ఇంత ఘోరం ఎన్నడూ చూడలేదు. వేసవికాలం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అక్రమార్కులకు సహకరించకుండా గ్రామానికి విద్యుత్ సరఫరాను సక్రమంగా ఇవ్వాలి. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించడం లేదు.
కొల్లేటి అప్పలరాజు, రెడ్డి కంచేరు

యథేచ్ఛగా విద్యుత్ చౌర్యం