
ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
విజయనగరం క్రైమ్:
ఏపీ సెక్రటేరియట్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఏడుగురు నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేసిన ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లను సృష్టించి నిందితులు రూ.53 లక్షలు కాజేశారు. ఈ మేరకు ముఠాలోని ఐదుగురిని ఒకటో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు శనివారం మీడియాకు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రదీప్నగర్కు చెందిన నిందితుడు కె.సాయి వెంకట్ సుజిత్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదించాలని ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దానిని చూసిన విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, గుంటూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువకులు సుజిత్ను సంప్రదించారు. విజయవాడలోని సెక్రటేరియట్లో పలు ప్రభుత్వ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు వేయిస్తామని చెప్పి ఒకొక్కరి నుంచి రూ.5 నుంచి ఎనిమిది లక్షల వరకు మొత్తంగా రూ.53 లక్షలు తీసుకొని మోసం చేశాడు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు సృష్టించి వారికి అందించారు. ఏడుగురు బాధితులను విజయవాడ తీసుకొచ్చి నెల రోజుల పాటు అక్కడే ఉంచారు. తొందర్లోనే మీకు సమాచారం ఇస్తామని చెప్పి వారిని వెళ్లిపోమ్మన్నారు. ఎంతకీ ఎలాంటి సమాచారం రాకపోవడంతో బాధితుల్లో ఒకరైన ఎస్.కోట మండలం ధర్మవరానికి చెందిన బాధితుడు ఎస్.వినోద్ ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేశాడు. సీఐ ఎస్.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఐదుగురు ఏపీ వాసులు, నలుగురు హైదరాబాద్కు చెందిన వారు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు అయిందనే విషయం తెలిసిన వెంటనే నిందితులు పరారయ్యారు.
ఇంతలోనే..
ముఠాలో కీలక నిందితుడైన విజయనగరానికి చెందిన సాయి వెంకట్ సుజిత్కు ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు మిగతా నిందితులైన విజయనగరానికి చెందిన సీహెచ్ మహేష్, జంగారెడ్డిగూడెంకు చెందిన రూబిన్ కుమార్, ఏలూరుకు చెందిన జాన్, యాకూబ్లు విజయనగరం వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాటు వేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నేరం చేసినట్టు అంగీకరించారు. హైదరాబాద్లో నకిలీ ఐడీ కార్డులు, అపాయింట్మెంట్ ఆర్డర్లు తయారు చేసినట్టు అంగీకరించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులనూ త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు సుజిత్ కోలుకోగానే అరెస్టు చేస్తామన్నారు. కేసును వేగవంతంగా ఛేదించినందుకు సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రసన్నకుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఏడుగురు నుంచి
రూ.53 లక్షల వసూలు
నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ల
అందజేత
పోలీసులకు పట్టుబడిన నిందితులు

ఉద్యోగాల పేరిట ఘరానా మోసం