వీరఘట్టం హైస్కూల్‌ ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

వీరఘట్టం హైస్కూల్‌ ముస్తాబు

Jun 7 2025 12:29 AM | Updated on Jun 7 2025 12:29 AM

వీరఘట

వీరఘట్టం హైస్కూల్‌ ముస్తాబు

వజ్రోత్సవ సంబరానికి..

వీరఘట్టం: వజ్రోత్సవ సంబరాలకు వీరఘట్టం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ముస్తాబవుతోంది. 1950లో స్థాపించిన ఈ పాఠశాల ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 75 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులు పాఠశాలలో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించారు. దేశవిదేశాల్లో వివిధ ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తున్నారు. తమ ఉన్నతికి అక్షర పునాది వేసిన పాఠశాల ఒడిలో మిత్రులు, గురువులను కలిసేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 8న ఆదివారం వజ్రో త్సవ వేడుకల నిర్వహణకు ముమ్ముర ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాల స్థాపించినప్పటి నుంచి ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు, ఆఫీస్‌ సిబ్బంది సుమారు 300 మందిని సత్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1950లో ఇక్కడ హైస్కూల్‌ స్థాపించడానికి 5 ఎకరాల స్థలం (ప్రస్తుత విలువ రూ.30 కోట్లు) ఉచితంగా అందజేసిన కత్తులకవిటి గ్రామానికి చెందిన దివంగత రౌతు చిన్నంనాయుడు విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఆయన మనవడు, ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి రౌతు సురేష్‌కుమార్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డైమండ్‌ జూబ్లీలో తమ బాల్య మిత్రులను కలుసుకునేందుకు, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనం చేసేందుకు అమెరికా, లండన్‌, బ్యాంకాక్‌, సింగపూర్‌ తదితర దేశాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులు రానుండడంతో సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి. 1969లో రిలీవ్‌ అయిన మొదటి పదో తరగతి బ్యాచ్‌తో పాటు 2020లో రిలీవైన టెన్త్‌ బ్యాచ్‌ వరకు 52 బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థులు వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొననున్నట్టు పూర్వ విద్యార్థి బెహరా ప్రసాద్‌ తెలిపారు.

ఇవే పార్కింగ్‌ స్థలాలు....

వజ్రోత్సవ వేడుకలకు కార్లు ఇతర వాహనాలపై వచ్చే వారు తమ వాహనాలను తహసీల్దార్‌ కార్యాలయం వెనుక వైపు, హైస్కూల్‌ ఎదురుగా ఉన్న స్థలంలో లేదా, బాలికల పాఠశాల పక్కనే ఉన్న లే–అవుట్‌లలో పార్కింగ్‌ చేసుకోవాలని ఎస్‌ఐ జి.కళాధర్‌ సూచించారు. ఆయన వజ్రోత్సవ వేడుకల ప్రాంగణం, పార్కింగ్‌ ప్రదేశాలను శుక్రవారం పరిశీలించారు. వజ్రోత్సవ పండగ ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగేలా చూసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు.

ఎన్నాళ్లో

వేచిన

సమయం..

ఈ నెల 8న చదువులమ్మ ఒడిలో సాగనున్న వజ్రోత్సవ పండగ

తరలివస్తున్న 52 బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థులు

వీరఘట్టం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ స్థాపించి 75 ఏళ్లు పూర్తి

విదేశాల నుంచి ఒకొక్కరికిగా చేరుకుంటున్న విద్యార్థులు

హైస్కూల్‌కు 5 ఎకరాల స్థలాన్ని ఇచ్చినదాత రౌతు చిన్నంనాయుడు విగ్రహ ప్రతిష్టకు సన్నాహాలు

వజ్రోత్సవ వేడుకల కోసం ఎన్నాళ్లో వేచిన సమయం ఈ నెల 8న రానుండడంతో ప్రతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన మాస్టార్లను విడివిడిగా సత్కరించేందుకు ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. వారితో గ్రూప్‌ ఫొటోలు దిగేందుకు ప్రత్యేకంగా కెమెరామెన్‌లను బుక్‌చేసుకున్నారు. తమ బ్యాచ్‌ వారు ఒకరిని ఒకరు గుర్తు పట్టేందుకు ప్రత్యేక కలర్‌ కోడింగ్‌ ఉన్న దుస్తులు కూడా ధరించనున్నారు. 14 ఏళ్ల వయస్సులో పదో తరగతిలోని క్లాసు రూమ్‌లో చేసిన అల్లర్లు, స్నేహితులతో తిరిగిన పాఠశాల ప్రాంగణం, వీరఘట్టం పరిసర ప్రాంతాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు రానుండడంతో వీరందరికీ స్వాగతం పలికేందుకు ఉత్సవ కమిటీ సర్వం సిద్ధం చేస్తోంది.

హైస్కూల్‌లో పండగ వాతావరణం

వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లు వారం రోజులుగా జరుగుతుండడంతో పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడ పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన, బదిలీపై వెళ్లినపోయిన ఉపాధ్యాయులందరికీ పూర్వ విద్యార్థులు ఆహ్వాన పత్రికలు పంపించారు. అలాగే అన్ని బ్యాచ్‌ల నుంచి సుమారు 1500 మందల మంది పూర్వవిద్యార్థులు వస్తున్నట్లు సమాచారం. ఉత్సవ నిర్వహణకు తమవంతు సహాయంగా సుమారు రూ.12 లక్షలకు పైగా విరాళాలను ఇచ్చారు. ఉదయం టిఫన్‌ నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్‌ను అందరికీ అందించేందుకు ఆర్గనైజింగ్‌ కమిటీలో ఉన్న పూర్వ విద్యార్థులు ఏర్పాట్లు చేశారు.

వీరఘట్టం హైస్కూల్‌ ముస్తాబు 1
1/3

వీరఘట్టం హైస్కూల్‌ ముస్తాబు

వీరఘట్టం హైస్కూల్‌ ముస్తాబు 2
2/3

వీరఘట్టం హైస్కూల్‌ ముస్తాబు

వీరఘట్టం హైస్కూల్‌ ముస్తాబు 3
3/3

వీరఘట్టం హైస్కూల్‌ ముస్తాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement