
జిల్లాకు కొత్తగా 1,521 జీవిత భాగస్వామి పింఛన్లు మంజూరు
పార్వతీపురం టౌన్: జిల్లాలో కొత్తగా 1,521 మంది వితంతువులకు జీవిత భాగస్వామి పింఛను మంజూరైనట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. 2023 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ మధ్య కాలంలో వితంతువులైన వారికి జీవిత భాగస్వామి పింఛన్లను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓను విడుదల చేసిందని ఆదివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులకు తెలిపారు. మంజూరైన కొత్త పింఛన్లను రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా మే 1వ తేదీ ఉదయం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేదల సేవలో భాగంగా జిల్లాలో 1,39,752 మందికి రూ.59.72 కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. వీటికి అదనంగా 1,521 మంది వితంతువులకు జీవిత భాగస్వామి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. కావున మొత్తం పింఛన్లకు సరిపడా నిధులను ముందుగానే సిద్ధం చేసుకొని మే 1వ తేదీ ఉదయం 10గంటల్లోగా శత శాతం పింఛన్లు పంపిణీ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
మండలాల వారీగా మంజూరైన కొత్త పింఛన్లు
బలిజిపేట మండలంలో 69 మందికి, భామినిలో 86, గరుగుబిల్లిలో 77, గుమ్మక్ష్మీపురం 63, కొమరాడలో 66, జియ్యమ్మవలసలో 122, కురుపాంలో 51, మక్కువలో 131, పాచిపెంటలో 88, పాలకొండలో 77, పాలకొండ(అర్బన్)లో 47, పార్వతీపురం 126, పార్వతీపురం (అర్బన్)లో 60, సాలూరులో 75, సాలూరు (అర్బన్)లో 70, సీతంపేటలో 69, సీతానగరంలో 117, వీరఘట్టంలో 127 వెరసి మొత్తం 1,521 కొత్త పింఛన్లు మంజూరైనట్టు కలెక్టర్ వివరించారు. కాన్ఫరెన్స్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మే 1వ తేదీన కొత్త పింఛన్లు పంపిణీ చేయాలి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ శ్యామ్ప్రసాద్