జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ సుందరాచారి | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ సుందరాచారి

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ సుందరాచారి గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ నాగార్జునకొండ వెంకటసుందరాచారిని నియమిస్తూ శనివారం డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ విష్ణువర్ధన్‌ అత్లూరి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్‌ సుందరాచారి గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ 2024 నవంబరు 1 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ యశశ్వి రమణ ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఫుల్‌ అడిషనల్‌ చార్జి (ఎఫ్‌ఏసీ) సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ సుందరాచారిని నియమిస్తూ డీఎంఈ ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్‌ పోస్టు కోసం పలువురు వైద్యులు పోటీ పడినప్పటికీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా రెండేళ్లలో డాక్టర్‌ సుందరాచారి చేసిన అభివృద్ధి పనులను గుర్తించి ఆయనకే పదవి అప్పజెప్పారు. ఆదివారం సాయంత్రం డాక్టర్‌ సుందరాచారి బాధ్యతలు స్వీకరిస్తారు. పలువురు గుంటూరు వైద్య కళాశాల వైద్యులు, వైద్య సిబ్బంది, గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు, వైద్య సిబ్బంది డాక్టర్‌ సుందరాచారికి అభినందనలు తెలిపారు. సూర్యలంక,చీరాల బీచ్‌లకు ప్రత్యేక స్థానం ఐజీ త్రిపాఠిని కలిసిన సీఐలు సాగరతీరం అల్లకల్లోలం

జిల్లా ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి

బాపట్ల: భారత చిత్రపటంలో సూర్యలంక, చీరాల బీచ్‌లు ప్రత్యేక స్థానాన్ని సంతరించుకోనున్నాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సూర్యలంక బీచ్‌లో ‘బీచ్‌ ఆఫీసు’, ‘బీచ్‌ మెడికల్‌ ఎమర్జెన్సీ రెస్పాన్‌న్స్‌ సెంటర్‌’లను మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌, బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జి.కోటేశ్వరరావు, బావుడా చైర్మన్‌ రాజశేఖర్‌బాబులతో కలిసి శనివారం సాయంత్రం ప్రారంభించారు. అత్యవసర విభాగంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వస్తువులు, పరికరాలను మంత్రి పరిశీలించారు. బే ఆఫ్‌ బాపట్ల లోగోతో ముద్రించిన టోపీలు, జనపనార సంచులు, కీచైన్‌లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందుగా కొబ్బరి మొక్కలు నాటారు. బీచ్‌ వద్ద పునఃనిర్మించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ను ప్రారంభించారు. ప్రజలు సైతం పర్యాటకంపై ఎంతో ఆసక్తి చూపుతున్నారని వివరించారు. బాపట్ల జిల్లా అభివృద్ధి బాట పట్టిందని మంత్రి పార్థసారథి చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, డీపీఓ ప్రభాకరరావు, ఇన్‌చార్జి టూరిజం ఆఫీసర్‌ ఆనంద్‌ సత్యపాల్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

నగరంపాలెం: ప్రతి ఒక్కరూ సమర్థంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. గుంటూరు రేంజ్‌లోని పలు యూనిట్లలో ఉద్యోగోన్నతి పొందిన 24 మంది సీఐలు శనివారం గుంటూరు కలెక్టర్‌ బంగ్లా రోడ్‌లోని గుంటూరు రేంజ్‌ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఐజీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజా సేవా దృక్పథంతో పోలీస్‌ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని సూచించారు. సీఐలుగా ఉద్యోగోన్నతి పొందిన వారిలో గుంటూరు జిల్లాలో పది మంది, పల్నాడు జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, సీఐడీలో ఇద్దరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, తిరుపతి జిల్లా, సీీసీఎస్‌ నుంచి ఒక్కొక్కరూ ఉన్నారని తెలిపారు.

కోడూరు: హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ మార్పులతో రెండు రోజుల నుంచి అలలు ఉధృతి ఎక్కువగానే ఉంది. శనివారం ఆ తీవ్రత మరింత అధికమైంది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు కూడా ముందుకు చొచ్చుకువచ్చి డాల్ఫిన్‌ భవనం చుట్టూ చేరాయి. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు ముందు జాగ్రత్తగా తీరం గేట్లను మూసివేశారు. పాలకాయతిప్ప కరకట్ట వద్దే పర్యాటకుల రాకపోకలను నిషేధించారు.

Advertisement
 
Advertisement
Advertisement