రైళ్లలో చోరీలు.. వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రైళ్లలో చోరీలు.. వ్యక్తి అరెస్టు

May 30 2026 3:08 AM | Updated on May 30 2026 3:08 AM

చీరాల రూరల్‌: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను చీరాల రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జీఆర్పీ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై సీహెచ్‌.కొండయ్య నిందితుని వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా వడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లపు సాయిప్రియ ఈనెల 25వ తేదీ తన కుటుంబ సభ్యులతో తిరుచానూరు రైల్వే స్టేషన్‌ నుంచి నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా రైలు చీరాల రైల్వేస్టేషన్‌లో ఆగిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె హ్యాండ్‌బ్యాగును అపహరించాడు. బ్యాగులో 9 గ్రాముల బంగారు నల్లపూసల దండ, ఒక సెల్‌ఫోన్‌, రూ.1,500 నగదు ఉన్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల్లూరు డీఎస్పీ మురళీధర్‌ సూచనలతో ఒంగోలు ఐఆర్పీ ఎస్‌కే మౌలా షరీఫ్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడు పాత నేరస్తుడు వేటపాలం మండలం కొత్తపేట ప్రసాద్‌నగర్‌కు చెందిన పెరికల సందీప్‌గా గుర్తించారు. చీరాల రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్‌ 4లో ఉన్న అతడిని అరెస్టు చేసినట్లు ఎస్సై కొండయ్య తెలిపారు. నిందితుని వద్ద నుంచి 9 గ్రాముల బంగారు నల్లపూసల దండ, మూడు సెల్‌ఫోన్‌లు రికవరీచేసి రిమాండ్‌ నిమిత్తం నెల్లూరు రైల్వే కోర్టుకు తరలించినట్లు ఎస్సై చెప్పారు. కొద్ది రోజుల్లోనే కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొద్దిరోజుల్లో ఛేదించిన జీఆర్పీ ఎస్సై సీహెచ్‌. కొండయ్య, పోలీసు సిబ్బందిని నెల్లూరు డీఎస్పీ ఎం.మురళీధర్‌, ఒంగోలు ఐఆర్పీ మౌలా షరీఫ్‌ అభినందించారు.

నిందితుని నుంచి బంగారం,

మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం

Advertisement
 
Advertisement
Advertisement