పిడుగురాళ్ల: జిల్లాలోని విత్తన డీలర్లు విత్తన చట్టం ఖచ్చితంగా పాటించి విక్రయాలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు అన్నారు. పట్టణంలోని కె కన్వెక్షన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం విత్తన డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమం పిడుగురాళ్ల ఏడీఏ శ్రీ కృష్ణ దేవరాయలు అధ్యక్షతన నిర్వహించారు. పిడుగురాళ్ల సబ్ డివిజన్లోని ఐదు మండలాల విత్తన డీలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. జగ్గారావు మాట్లాడుతూ వీరంతా ఖచ్చితంగా విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ ఉత్తర్వులతోపాటు 1983 విత్తన రూల్స్, పర్యావరణ పరిరక్షణ చట్టం పూర్తిగా తెలుసుకొని విత్తనాలు అమ్మకాలు చేయాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అమ్మాలని, అమ్మిన ప్రతి రైతుకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. విత్తన డీలర్లపైన రైతుల ఫిర్యాదులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత డీలర్లదేనని తెలిపారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే డీలర్లపైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల సబ్ డివిజన్లోని ఐదు మండలాల ఏవోలు ఎం.సంధ్యారాణి, కె. రామమ్మ, కె.వెంకటేషే, నరసింహారావు, కె.దేవదాసు, ఐదు మండలాల విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు


