అమరావతి: మద్యం మత్తులో ఓ బాలుడు బాలికపై దాడి చేసిన ఘటన అమరావతి గ్రామంలోని పల్లపు వీధిలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లేమల్లె గ్రామానికి చెందిన మైనర్ బాలుడు మత్తులో ఉండి బుధవారం రాత్రి పల్లపువీధిలో ఇంటి బయట ఆడుకుంటున్న మైనర్ బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఈదాడిలో బాలికకు పలుచోట్ల గాయాలు కావటంతో స్థానికులు మైనర్ బాలుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన బాలిక స్థానిక కమ్యూనిటీ హెల్త్సెంటర్లో చికిత్స పొందుతుంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వై.అచ్చియ్య తెలిపారు.
తాడికొండ: తాడికొండ మండలం ముక్కామల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్ని రామారావుకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైఎస్సార్ సీపీ బ్యానర్ కట్టారనే ఆరోపణలతో మంగళవారం వెనిగండ్లలోని నివాసంలో చిన్ని రామారావును పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
చేబ్రోలు: కొద్ది రోజులుగా వీస్తున్న వడగాడ్పులకు శతాధిక వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు.. మండలం వడ్లమూడి యాదవపాలేనికి చెందిన తోట బసవమ్మ(104) మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలు బసవమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వంద సంవత్సరాలు దాటినప్పటికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. నాలుగు రోజులుగా తీవ్రమైన ఎండ, వడగాడ్పులకు అస్వస్థతకు గురైంది. స్థానిక పెద్దలు, బంధువులు మృతదేహానికి నివాళులర్పించారు.
నగరంపాలెం: ఉమ్మడి జిల్లాలోని విత్తన దుకాణాల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారుల తనిఖీలు బుధవారం కొనసాగాయి. గుంటూరు ప్రాంతీయ విజిలెన్న్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి డి.సూర్యశ్రావణ్కుమార్ నేతృత్వంలో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నుతల గ్రామంలోని మెస్సర్స్ కర్షక్ క్రాప్ సన్న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. స్టాక్ రిజిస్టర్, ప్రాసెసింగ్ సీడ్ రిజిస్టర్ నిర్వహించకపోవడం, అలాగే విత్తనాలకు సంబంధించి ఇన్వాయిస్లు, సోర్స్ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడాన్ని తనిఖీల్లో గుర్తించారు. దీంతో రూ.45.88 లక్షల విలువ చేసే 11,677.5 కిలోల సూపర్–10 (మిరప), ఎర్ర మిరప, రెమినెంట్ విత్తనాల విక్రయాలు నిలిపివేస్తూ నోటీసులు జారీచేశారు.
కొరిటెపాడు (గుంటూరు): ప్రస్తుతం వీస్తున్న ఈదురు గాలులతో కూడిన వర్షాలకు విద్యుత్ స్తంభాలు పడిపోయి వైర్లు తెగిపడినా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన వెంటనే గుంటూరు విద్యుత్ శాఖకు తెలియజేయాలని ఆ శాఖ ఆపరేషన్ డివిజన్ టౌన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు పీహెచ్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం గుంటూరు డివిజన్ కార్యాలయంలో 9440817527 నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబరు 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ టోల్ నెంబర్లో విద్యుత్ సిబ్బంది నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు సమాచారం అందించి సమస్యను వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. విద్యుత్ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో మరమ్మతులు చేస్తున్నారని వెల్లడించారు. విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటిని ముట్టుకోకుండా వెంటనే శాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనవసరపు ఆందోళనకు గురి కావద్దని, సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


