ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అలరించిన జాతీయస్థాయి నాటికల పోటీలు
నాదెండ్ల: టీవీ, సినిమారంగం రాకమునుపు నాటకాలు, నాటికలే ప్రజలకు వినోదాన్ని అందించటమేకాక, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతల నిర్మూలనలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాయని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సాతులూరులో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి నాటికల పోటీలు బుధవారం కొనసాగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ కళలను ప్రోత్సహిస్తున్న సాతులూరు గ్రామస్తులను అభినందించారు. హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ సాతులూరు గ్రామం కళలకు పెట్టింది పేరన్నారు. రంగస్థల కళలను బతికించేందుకు జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు.
ఆకట్టుకున్న నాటికలు...
హైదరాబాద్ స్వర్ణసూర్య డ్రామా లవర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉదయ భాగవతుల రచన, దర్శకత్వంలో సీ్త్ర మాత్రే నమః నాటిక ఆకట్టుకుంది. విజయవాడ హర్ష క్రియేషన్స్ వారి కత్తి శ్యామ్ప్రసాద్ దర్శకత్వంలో, పి.టి. మాధవ్ రచించిన చెరిగిపోని చిరునామా, గుంటూరు శ్రీకరణం సురేష్ మోమోరియల్ థియేటర్స్ వారి రామకృష్ణ బొమ్మిది రచనా దర్శకత్వంలో ప్రదర్శించిన తరమెల్లి పోతున్నదో నాటిక ఆకట్టుకున్నాయి. అనంతరం పత్తిపాటి భార్గవి బృందంచే నృత్య ప్రదర్శన అలరించింది. కార్యక్రమంలో నాటక అకాడమీ డైరెక్టర్ బండారుపల్లి విశ్వేశ్వరరావు, ముత్తవరపు సురేష్, సినీనటి మౌనికచౌదరి, మాజీ సర్పంగ్ గొట్టిపాటి వెంకటరమణ, నడింపల్లి వెంకటేశ్వరరావు, బండారుపల్లి రామారావు, గొట్టిపాటి రామారావు, డాక్టర్ శాఖమూరి బాజి, కొల్లి బ్రహ్మయ్య, ప్రముఖ న్యాయవాది కట్టా వరలక్ష్మీ, బండారుపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.


