ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ
మంగళగిరి టౌన్: అగ్నిప్రమాద బాధితులు ఉచిత ప్లాస్టిక్ సర్జరీని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉచిత ప్లాస్టిక్ సర్జరీ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కాలిన గాయాలతో బాధపడుతున్న వారికి బర్న్ సర్వైవర్ మిషన్ – సేవియర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ప్లాస్టిక్ సర్జరీలను ఉచితంగా హైదరాబాద్లో నిర్వహిస్తోందని పేర్కొన్నారు. తద్వారా బాధితులకు పునర్జన్మ, మెరుగైన జీవనం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల సర్జరీలు చేయించుకోలేని బాధితులకు ఒక అద్భుత అవకాశమని వెల్లడించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా బాధితులకు వైద్యసహాయం అందించడంతో పాటు భవిష్యత్తులో తమ రెండు సంస్థలు కలసి మరింత విస్తృతంగా సామాజిక బాధ్యతలను చేపట్టనున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ నీహారి మండలితో కలసి సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్జరీలు మే 28 నుండి జూన్ 2 వరకు జరుగుతాయని, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలు, పేర్ల నమోదు కోసం 7816079234ను సంప్రదించాలని తెలిపారు. అనంతరం ఉచిత ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ కరపత్రాలను ఆవిష్కరించారు.


