తల్లి చుట్టూ ఏడుస్తూ తిరిగిన ముగ్గురు చిన్నారులు
1098కు సమాచారం ఇచ్చినా ఆలస్యంగా స్పందన
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే దారి ఫస్ట్ గేటు సమీపంలో ఓ మహిళ స్పృహ తప్పి మంగళవారం మధ్యాహ్నం పడిపోయింది. ఆమెతో ఉన్న ముగ్గురు చిన్నారులు ఏడుస్తూ సహాయం కోసం ఎదురుచూశారు. గమనించిన స్థానికులు వెంటనే చైల్డ్ కేర్ హెల్ప్లైన్ టోల్ఫ్రీ నెంబర్ 1098కు సమాచారం ఇచ్చారు.
గంటల తరబడి అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి అపస్మారక స్థితిలో ఉండగా, చిన్నారులు ఆకలితో, భయంతో రోడ్డు పక్కనే ఉండిపోవడం చూపరులను కలచివేసింది. చైల్డ్ ప్రోటెక్షన్ అధికారులు రాజ్యలక్ష్మి, నవీన అక్కడకు చేరుకున్నారు. స్పృహ కోల్పోయి పడి ఉన్న ఆమెను కనిగిరికి చెందిన లక్ష్మిగా గుర్తించారు. కాస్త తేరుకున్న తర్వాత మహిళ, చిన్నారులను వాహనంలో వన్స్టాప్ కేంద్రానికి తరలించారు.


