నాదెండ్ల: డిజిటల్ హవా నడుస్తున్నా... ప్రజా సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని సామాజిక చైతన్యం పెంపొందించటంలో నాటికలు నేటికీ సజీవ కళలుగా నిలిచాయని నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ చెప్పారు. సాతులూరులోని బండారుపల్లివారిపాలెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో భారతీ కళావేదికపై కరణం సురేష్ కళాప్రాంగణంలో నాలుగవ జాతీయస్థాయి నాటికల పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు వజ్జా మధుసూదనరావు ప్రదర్శించిన విశ్వామిత్ర ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. యడ్లపాడు మానవతాసాగరి సమర్పణలో జరుగుల రామారావు దర్శకత్వంలో అందరూ మంచివారే కానీ అనే నాటిక ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వంలో గోవిందరాజుల నాగేశ్వరరావు రచించిన గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ వారి సరిగమ పాప ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది. రెండోరోజు సోమవారం మహమ్మద్ ఖాజావలి దర్శకత్వంలో పీవీ సత్యనారాయణ రచించిన ఏలూరు వారి హేలాపురి కల్చరల్ అసోసియేషన్ సమర్పణలో అనగనగా ఓ రాత్రి, పొన్నాడ ముత్యాలరావు దర్శకత్వంలో గోవిందరాజుల నాగేశ్వరరావు రచించిన అనకాపల్లి ఎన్.ఎమ్.ఆర్. క్రియేషన్స్ సమర్పించిన మలిసంధ్య, అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వంలో ఆరాధ్యుల తేజశ్విప్రఖ్య రచించిన తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ సమర్పించిన విజేతలను ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా అశ్వనీ ఆసుపత్రి వైద్యులు ఆవుల శ్రీనివాసరావు, మక్కెన వంశీకృష్ణ, డాక్టర్ కిలారి సునీల్కుమార్, జీబీఆర్ హేచరీస్ యజమాని గడ్డం బుచ్చారావు, సినీనటి వర్షిణి, కందుల రాజు, లైఫ్లైన్ హాస్పటల్స్ పేరం రాజానందరెడ్డి, మైనేడి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.
సాతులూరులో ప్రారంభమైన జాతీయస్ధాయి నాటికల పోటీలు


