తాడేపల్లి రూరల్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్ డిమాండ్ చేశారు. ఆదివారం తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు. ఇటీవల దళిత సామాజిక వర్గం ఓట్లపై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనే అని, దళిత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన ఉన్నత పదవిలో ఉండి, చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన వ్యక్తి, ఒక వర్గాన్ని అవమానించేలా మాట్లాడడంపై సామాజిక, రాజకీయ రంగాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమతున్నాయని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పోరాడి సాధించిన శక్తివంతమైన ఓటు హక్కును, దళిత సమాజ ఆత్మగౌరవాన్ని తక్కువచేసి మాట్లాడం తగదని పేర్కొన్నారు. చట్టసభల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీల జెండాలను పక్కన పెట్టి, తమ సామాజిక వర్గ హక్కుల కోసం గళం విప్పాలని విజ్ఞప్తి చేశారు. ఆయనపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


