● తిరుమల పవిత్రతను
కాపాడాలని వైఎస్సార్సీపీ డిమాండ్
● పల్నాడు జిల్లా వ్యాప్తంగా
కదం తొక్కిన పార్టీ శ్రేణులు
● వెంకటేశ్వర స్వామి
ఆలయాలలో ప్రత్యేక పూజలు
● పాల్గొన్న నియోజకవర్గ
సమన్వయకర్తలు
● బీఆర్ నాయుడును
తొలగించకపోవడంపై ఆగ్రహం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
సత్తెనపల్లిలో పూజలు చేస్తున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి
నరసరావుపేటలో పూజలు చేస్తున్న వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి
సాక్షి, నరసరావుపేట: పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవిలో కొనసాగడానికి బీఆర్ నాయుడుకు అర్హత లేదని, టీటీడీ పవిత్రతను మంట గలిపిన ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. శనివారం పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో తొలుత దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ నాయుడిపై భక్తులలో ఇంత వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాచర్ల: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అనేక నీచమైన పనులకు పాల్పడ్డారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా బోర్డు చైర్మన్గా కొనసాగించడం సిగ్గుచేటన్నారు. పిన్నెల్లి ఆధ్వర్యంలో శనివారం క్యాంపు కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తప్పు చేసి కూడా బీఆర్ నాయుడు సమర్థించుకోవటం దారుణమన్నారు.
నరసరావుపేట: టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడానికి అపవిత్రుడైన బీఆర్ నాయుడుకు అర్హత లేదని, టీటీడీ పవిత్రతను మంట గలిపిన అతడిని చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించి ఆలయ ప్రవేశాన్ని నిషేధించాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బరంపేటలోని శ్రీ లీలా వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు చేసిన తర్వాత డాక్టర్ గోపిరెడ్డి, నాయకులు 101 కొబ్బరికాయలను కొట్టారు. అనంతరం గోపిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ హయాంలో వరుసగా అపవిత్ర సంఘటనలు జరుగుతున్నాయని, వాటి వల్ల బాధ కలుగుతోందన్నారు.
అమరావతి: తిరుమల పవిత్రతను చైర్మన్ మంటగలుపుతుంటే సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు నంబూరు శంకరరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చైర్మన్ రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశాన్ని భగ్నం చేద్దామన్న కూటమి కుట్ర ఫలించలేదు. సమావేశ సమయంలో కూటమి నేత ఆలోకం సుధాకర్ అనుచరులతో వచ్చి బీఆర్ నాయుడుకు మద్దతు పలుకుతూ వాగ్వివాదానికి దిగారు. నంబూరు శంకరరావు తగిన సమాధానం ఇవ్వడంతోపాటు వెనుదిరిగారు. కూటమికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నినాదాలు చేశాయి.
సత్తెనపల్లి: బీఆర్ నాయుడును చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని 20వ వార్డు వడ్డవల్లి కూరగాయల మార్కెట్ వద్ద గల శ్రీరామాలయం, శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం ఆయన ప్రత్యేక పూజ కార్య క్రమాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న బీఆర్ నాయుడును వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలన్నారు. టీవీ5 చానల్లో కూటమి ప్రభుత్వపు పబ్లిసిటీ కోసమే బీఆర్ నాయుడును చంద్రబాబు ఇంకా కొనసాగిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి పబ్లిసిటీయే ముఖ్యమైందన్నారు.


