చిలకలూరిపేట: బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించి, తిరుమల పవిత్రతను కాపాడాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి విడదల రజిని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండప ప్రాంగణంలో ఉన్న శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఆమె పూజలు నిర్వహించారు. ముందుగా ఎన్ఆర్టీ రోడ్డులోని నివాసం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో బైక్ ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. పూజల అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ..తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించిన బీఆర్ నాయుడును చంద్రబాబు నాయుడు పదవి నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమన్నారు. భక్తుల మనోభావాలను చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.


