దుర్గి: ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్న తరుణంలో కాబోయే జంటను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని ఓబులేశునిపల్లె ప్రధాన రహదారి పక్కన రైస్ మిల్లు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన నేలపాటి సందీప్ (21), నరసరావుపేట ప్రాంతానికి చెందిన సౌమ్య (20)లకు 20 రోజుల క్రితం నిశ్చయతాంబూలం తీసుకున్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని మొక్కు తీర్చుకునేందుకు నాగార్జున సాగర్ సాగర్మాత ఆలయానికి వెళ్లారు. మొక్కు తీర్చుకొని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణం అయ్యారు. ఓబులేశునిపల్లె రైస్ మిల్లు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను వారి బైకు ఢీ కొంది. ఇరువురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అనంతరం మృతదేహాలను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


