కారంచేడు: ఒక వ్యక్తి మృతి చెందిదే ఆ వ్యక్తిని కన్నీటితో సాగనంపుతారు. ఈ సాగనంపే ప్రక్రియలో మృతదేహంతో నానా అగచాట్లు పడాల్సి వస్తుందని మండలంలోని కుంకలమర్రు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు వాపోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా మా పెద్దలు, పూర్వీకులు మృతి చెందినప్పుడు ఎస్సీ కాలనీ వారి శ్మశాన వాటికకు తీసుకెళ్లడం చాలెంజ్గా మారిందని చెప్తున్నారు. మృతదేహాన్ని భుజాలపైన ఉంచుకొని రోడ్డు సరిగ్గా లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమాధుల ప్రాంతంలో కూడా గ్రామంలోని మురుగు నీరు అక్కడకు వచ్చి చేరుతుందని, దీని వలన మరింత ఇబ్బందికరంగా మారిందన్నారు. సమాధి చేయడానికి గుంతలు తీస్తుంటే నీరు చేరుతోందన్నారు. గతంలో చాలా సార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించి క్రైస్తవ శ్మశానవాటికకు వెళ్లే మార్గాన్ని సరి చేయడంతోపాటు, శ్మశానవాటిక ప్రాంతంలో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు వాపోతున్నారు.


