పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థిని
కుందురువారిపాలెం(ముప్పాళ్ల): తండ్రి మరణాన్ని సైతం బిగపట్టుకొని పదవ తరగతి పరీక్షకు హాజరైంది కుందురువారిపాలెం గ్రామానికి చెందిన విద్యార్థిని మేడ భావనలక్ష్మి. గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన మల్లికార్జునరావు (38), పద్మలకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్దదైన భావనలక్ష్మి చదువులో చురుగ్గా ఉండటంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో పదవ తరగతి చదివించుకుంటున్నారు. సోమవారం జరిగే సోషల్ స్టడీస్ పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఆదివారం రాత్రి భావనలక్ష్మి తండ్రి మల్లికార్జునరావు గుండెపోటుతో మృతి చెందాడు. కళ్లెదుటే తండ్రి మృతి తట్టుకోలేక, మరో వైపు పరీక్షకు సన్నద్ధమవ్వాల్సి ఉండటంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ ధైర్యం కోల్పోకుండా సోషల్ పరీక్షకు హాజరైంది. తన అన్న సాయంతో నరసరావుపేటలోని పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష సజావుగా రాసింది. తండ్రి మరణంతో వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్షకు హాజరైన విద్యార్థిని అభినందించారు.


